ఆగస్టు2007
డెట్రాయిట్ తెలుగు సాంస్కృతిక సంఘం సాహితీ సమావేశం – జూలై 22, 2007
జూలై 22, 2007 ఆదివారం మధ్యాహ్నం పూట. ఫార్మింగ్టన్ - డెట్రాయిట్ నగర పొలిమేరల్లో ఒక పట్టణం. ఫార్మింగ్టన్ ప్రజా గ్రంథాలయం లో పైన హాలు. డెట్రాయిట్ తెలుగు సాంస్కృతిక సంఘం ఆ పూట ఏర్పాటు చేసిన సాహితీ సమావేశం ఇంకా ప్రారంభం కాలేదు. సమావేశ సందర్భంగా కలిసే అవకాశం దొరికిన సాహితీ మిత్రులంతా తమకు దొరికిన ఆ అపూర్వ క్షణాలను ఆప్యాయపు పలకరింతలతో, సాహితీ ముచ్చట్లతో గడుపుతున్నారు. సమావేశానికి ఆహ్వానించ బడ్డ అతిథులు నవోదయ రామ్మోహన రావు, కడియాల రామమోహన రాయి, వాసిరెడ్డి నవీన్ ముందు వరసలో కూర్చుని ఉన్నారు. డెట్రాయిట్ తెలుగు లిటరరీ క్లబ్ సాహితీ మిత్రులు మద్దిపాటి కృష్ణా రావు ముందుగా సభకు విచ్చేసిన సాహితీ మిత్రులకు ఆహ్వానం పలికి, వక్తలను పరిచయం చేసారు. నవోదయ సంస్థ అధిపతి రామ్మోహనరావు గురించి ప్రదర్శించిన లఘు చిత్రం సభికులని ఆకట్టుకుంది. సుప్రసిద్ధ సాహితీ విమర్శకులు కడియాల రామ్మోహనరాయి, కథా నవీన్ గా పేరు పొందిన వాసిరెడ్డి నవీన్ నీ సభికులకి పరిచయం చేసాక కృష్ణా రావు వక్తలను వేదిక పైకి ఆహ్వానించారు. ముందుగా నవోదయ రామ్మోహనరావు తెలుగులో ప్రచురణ సంస్థల గురించి వాటి పుట్టు పూర్వోత్తరాల గురించీ సవివరంగా ప్రసంగించారు. పాశ్చాత్య దేశాల్లో ఒక పరిశ్రమగా అభివృధ్ధి చెందిన ప్రచురణ పరిశ్రమ మన తెలుగులో ఎటువంటి పరిస్థితుల్లో ఉందో వివరించారు. నవోదయ సంస్థ ను స్థాపించిన తాను ఎదుర్కొన్న సాధక బాదకాలను వివరిస్తూ తెలుగు సాహిత్యంలో ఒక్కో మలుపు దగ్గర పాఠకులను ఆకట్టుకున్న రచనలూ, ట్రెండ్ సెట్టర్స్ గా నిలిచిన రచనల గురించీ తెలిపారు. తర్వాత ప్రసంగించిన కడియాల రామ్మోహనరాయి “తెలుగు సాహిత్యం లో రైతు” అనే అంశం పై సవివరమైన ప్రసంగం చేసారు. ప్రాచీన సాహిత్యంలోకి వెళ్ళి హాలుని గాథా సప్త శతి లో ఎట్లా ఆనాటి సామాజిక జీవితం ప్రతిబింబించిందో వివరిస్తూ అట్లా కాల క్రమేణా తెలుగు సాహిత్యంలో రైతు జీవితాన్ని ప్రతిఫలించిన తీరు సోదాహరణంగా సవివరంగా వివరించారు. భారతదేశం లాంటి వ్యవసాయ ప్రధాన దేశాల్లో, ముఖ్యంగా తెలుగు నేలపై రైతులు పడుతున్న అష్టకష్టాలూ, ఎదుర్కొంటున్న ఇబ్బందులూ, అనుభవిస్తున్న దయనీయ మైన పరిస్థితులూ ఎట్లా సాహిత్యంలో ప్రతిఫలించాయో రామ్మోహన రాయి వివరించారు. ఏటుకూరి వెంకటనర్సయ్య తదితర పద్య కవులు ఎంత అద్భుతంగా, శక్తివంతంగా తమ పద్యాల్లో రైతుల జీవితాన్ని చిత్రించారో అనేక పద్యాలను ఉదహరిస్తూ వివరించారు. విశ్వనాథ కూడా రైతుల దయనీయమైన స్థితిని ఎట్లా వర్ణించారో తెలిపారు. ‘పొలాల నన్నీ హలాల దున్నీ ఇలా తలంలో హేమం పిండగా’ అంటూ శ్రీ శ్రీ రైతులు, కష్టజీవులూ సామాజిక మార్పులో చోదక శక్తులని గుర్తిస్తూ రాసిన వైనం వివరిస్తూ ఆధునిక తెలుగు సాహిత్యం రైతుల కష్టాలూ కడగండ్లూ చిత్రించడమే కాదు, వాటికి కారణాలు వెదికి, రైతుల ప్రస్తుత స్థితికి కారణమైన సమాజాన్ని మార్చాల్సిన అవసరాన్ని ముందుకు తెస్తున్న అంశాల్ని వివరించారు. నాటికీ నేటికీ సమాజానికి అన్నం పెడుతున్న రైతు పూటకు పట్టెడన్నం లేక పస్తులుంటూ చివరికి ఆత్మహత్యలకు పాల్పడుతున్న దుర్భర పరిస్థితినీ, రైతులని నిర్లక్ష్యం చేస్తున్న పాలకుల విధానాలనూ తెలుగు సాహిత్యం ప్రతిఫలించిన తీరు వివరించిన రామ్మోహనరాయి ప్రసంగం సాహితీ మిత్రులను ఆకట్టుకుని ఆలోచింపచేసింది. తర్వాత ప్రసంగించిన నవీన్ “తెలుగు కథ వాసి రాసి” అనే అంశంపై మాట్లాడారు. తెలుగు లో సమకాలీనంగా వస్తున్న కథల గురించీ, ప్రతి ఏటా ఉత్తమ కథా సంకలనం తీసుకొస్తున్న తమ ప్రయత్నం గురించి తెలుపుతూ, తెలుగు కథల్లోని వస్తువునూ, శిల్పపరమైన అంశాల్నీ సోదాహరణంగా వివరంచారు. తెలుగు కథకులు తాము తీసుకున్న వస్తువులోనూ, శిల్పంలోనూ మారుతూ అభివృధ్ధి చెందుతూ ప్రతి ఏటా కథల్ని మెరుగు పెడుతున్న తీరుని వివరించారు. తెలుగు నేలపై కథకులకు నిర్వహిస్తున్న వర్క్షాప్ల గురించి, సాహితీ వర్క్షాప్ల గురించీ వివరిస్తూ తెలుగు కథకులు బాగ అధ్యనం చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. మూడు గంటలపైగా జరిగిన సాహితీ సమావేశం ఆద్యంతమూ ఆసక్తికరంగా సాగింది. సాహితీ మిత్రులకు ఎంతో సమాచారాన్ని అందించి ఆలోచించేట్టు చేసింది. చివరకు కృష్ణారావు వక్తలకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ వందన సమర్పణ చేసారు.
chitanya ఆగస్టు 2007 1
detriot meeting lo naveen tho patu palgonna telugu sahitya abimanula vivaralu telipithe bagundadi
కొత్తపాళీ ఆగస్టు 2007 2
ఈ సమావేశం గురించి మరికొంత ఇక్కడ చదవొచ్చు
http://kottapali.blogspot.com/2007/07/1.html
వాసిరెడ్డి నవీన్ కథ సంకలనాల సంపాదకుల్లో ఒకరు. కథ 2006 సమీక్ష ఇక్కడ చూడండి.
http://www.pranahita.org/2007/08/katha_2006_review
కడియాల రామమోహన రాయ్ గారు గుంటూరు జెకెసి కాలేజిలో తెలుగు అధ్యాపకులుగా రిటైర్ అయ్యారు.
నవోదయ రామమోహన రావుగారు విజయవాడలో నవోదయ పబ్లిషర్స్ అధినేత.