నవంబర్2007
సారీఘర్ (పురిటిగది)
వెచ్చపెట్టిన ఆముదంగిన్నె కుంపటిమీంచి దించి బల్లమీద పెట్టింది మంత్రసాని దాదమ్మ. అకస్మాత్తుగా మొదలయిన పురిటి నొప్పులతో అతలాకుతలమవుతున్న అదిలాదేవి అలవాటు కొద్దీ కాళ్ళు జాపుకోబోయి ఆ మధ్యగా వున్న మేరుపర్వతంలాంటి కడుపులో ఎక్కడో కలుక్కుమంటే ఒకసారి మూలిగింది. కళ్ళకు కట్టిన గంతలు జారిపోతుంటే బిగించి కట్టింది దాదమ్మ.
కళ్ళమీద చేత్తో తడుముకోబోతుంటే, “ఒద్దొద్దు నువ్విప్పుడే కళ్లు తెరవకూడదు, ఒక్క పావుగంటలో పని జరిగిపోతుంది, “
అంటూనే, బొడ్డుకింద నుంచీ వున్న రోమాల్ని రేజరుతో గట్టిగా గీసి అక్కడమంతా శుభ్రం చేసింది. మామూలుగా ఈ పని జరుగుతున్నప్పుడు ఏ ఆడది అయినా సిగ్గు తాలూకు ఇబ్బందితోనొ, కోసుకుపోతుందనే భయంతోనో బిక్కచచ్చినట్టుగా అయిపోతుంది. కానీ అదిలాదేవి శరీర శ్పృహలకు అతీతంగా ఎక్కడో వుంది.
ఒకటే ప్రశ్న…ఒకటే జవాబు.. ఒకటే వేదన…. వేవిళ్ళు మొదలయినప్పటినుంచీ నొప్పులొచ్చే దాక ఒకే భయాన్ని శిలువలాగా మోస్తోంది.
ఒకవేళ ఆడపిల్ల పుడితే….? అదే అడిగింది కూడా… “దాదమ్మా నిజం చెప్పు నా కడుపులో వున్నది మగబిడ్ద కాకపోతే….”
“అంతా నీచేతిలోనే వుంది” అలవాటయిన ప్రశాంతత దాదమ్మ గొంతులో…
దాదమ్మ ఆముదం ధారగా పోస్తూ పొట్టకిందనుంచీ ,పిరుదుల దాకా లోనా బయటా పట్టించడం అయ్యాక మళ్ళీ చెప్పింది.
“రాజాలాంటి మగ బిడ్డను కంటే సరి,…” “లేకపోతే _ “ఈ ప్రశ్న అదిలాదేవి నోట్లోంచి రాలేదు.కన్నీటి బొట్ల రూపంలో వచ్చింది.
దాదమ్మ కిదంతా మామూలే. తొలిచూలు తల్లులిలా ఏడుస్తూనే కంటారు. కన్నవాళ్ళలో ఏ కొందరో మగ బిడ్డలు…..నిర్ణయించిన ముహూర్తం ప్రకారం దుష్టఘడియలు రాకుండా భూమ్మీదకొస్తారు. ఆడపిల్ల పుడితే కుటుంబానికి పట్టబోయే విపత్తునెలా దాటించాలో ఆమెకు తెలుసు. కతియవార్ లో నర్సు ట్రైనింగు తీసుకుని చమన్ బస్తీలో వున్నవారంతా వృత్తి
నిపుణులే. దాదమ్మ తన చేత్తో ఇరవై మందిని స్వర్గానికి పంపింది.
స్వర్గం అంటే ఏమిటి ? మళ్ళీ జన్మకు సిద్ధం చెయ్యడం…కళాసీఘాట్, చౌముఖి చెరువుల్లో లో బిడ్డను ముంచి చేతులు దులుపుకోవడం కాదు. దాదమ్మ పుట్టిన మణిహారి గ్రామం వాళ్ళకి పద్ధతి తెలుసు. ఆడశిశువుల అంత్యక్రియలు ఈనాం కోసం కాకుండా పవిత్ర వృత్తి ధర్మంగా చేస్తారు. కాబట్టే ఆ శిశువు తిరిగి మగబిడ్డగా పుడతాడు. అందుకని శరీరాన్ని మట్టిలో కలపడమే న్యాయమని నమ్ముతారు. నిబద్ధతతో పనిచేస్తుంది కాబట్టి దాదమ్మకివ్వాల్సిన మూల్యం మిగిలిన వాళ్ళందరికంటే కొంచెం ఎక్కువే.
“దాదమ్మా…”అదిలా దేవి పిలిచింది కానీ అది పిలుపులా లేదు.కలవరింతలాగా వుంది.
“ఏంతల్లీ” అంటూ వచ్చింది. ఆదుర్దాగా…
“ఎవర్నీ… ఈ గదిలోకి ….రానివ్వద్దూ ఊఊఊ..”
“అలాగే ..వస్తే గిస్తే మీ అమ్మ రావాల… రేవు పొంగడం వల్ల రాలేదు గానీ….ఇప్పుడు వస్తుంది, మనవడిని ఎత్తుకుంటుంది” దాదమ్మ ధైర్యం చెబుతూ రెండు చేతులూ చెరో పక్కా మచం పట్టీ లు పట్టుకుని బిడ్డ రావడం కోసం ఎలా దారి ఇవ్వాలో చెప్పింది.
ఊపిరి బిగపట్టి దిగశ్వాస పెంచడంలో అలిసిపోయిన అదిలాదదేవి ఉన్నట్టుండి తన వల్ల కాదంటూ ఏడవడం మొదలు పెట్టింది.
దాదమ్మ గుండెలో రాయి పడింది. ఎనిమిదింపావులోపల ఈ పిండం బయట పడుతుందా లేదా??తీరా దుష్ట ముహూర్తం వచ్చాక కాన్పు చేసి ప్రయోజనం ఏమిటి ??ఎక్కడ తప్పు జరిగినా తన ఈనాం గంగలో కలుస్తుంది…..అనుకున్నదే తడవుగా పొట్టపై భాగం నుంచి బిడ్డ శరీరాన్ని ఉజ్జాయింపుగా చూసి ఉబ్బిన భాగాన్ని నైపుణ్యంగా కిందికి జరపడం మొదలు పెట్టింది.
దాదమ్మ చేతులు పక్కకు నెట్టేస్తూ మంచం దిగి వెళ్ళిపోయేదానిలా గింజుకుంటూ…,”వద్దు వద్దు నా బిడ్డను చంపడానికే వచ్చ్హావు” అంటూ ఏడుస్తోంది.
దాదమ్మ కదలకుండా కాళ్ళు రెండూ గట్టిగా పట్టుకుంది.
నొప్పి మీద నొప్పి గొలుసు కట్టుగా రావడానికి బదులు ఒక నొప్పి.. ఒక బెంగ …ఒక నొప్పి_రెండు బెంగలు…ఒక నొప్పి నాలుగు బెంగలు….అదిలా దేవి కడుపులో బిడ్డ ప్రయాణం మందగించింది. దాదమ్మకి పిచ్చెక్కి పోతోంది.గోడమీదగడియారం చూసి ఉలిక్కి పడి చివాలన బయటి కెళ్ళి అక్కడ ఆత్రంగా కూచున్న యజమానితో ఏదో చెప్పింది.
అరనిమిషం గడవకుండానే ప్రసూతిగది కిటికీ దగ్గర టపాకాయల కట్ట పేలడం మొదలు పెట్టింది.
ప్రాణభయంతొ అదిలాదేవి ఊపిరి బిగపట్టి లేవడానికి చేసిన ప్రయత్నంలో బలంగా ముక్కింది.
కేర్ కేర్ మంటూ దాదమ్మ చేతిలోకి జారింది బిడ్డ.
టపాకాయల చప్పుడు ఆగిపోయింది.
కళ్ళమీద గంతలు కిందికి లాక్కుని చూసింది అదిలాదేవి. ఈసారి గుండెలో నే మోగింది తుపాకి ఎందుకంటే పుట్టింది ఆడబిడ్డ….దాదమ్మ బిడ్డను జోలెలో కట్టుకుని అంది,
“ఏంచూస్తావు లేమ్మా చచ్చిన బిడ్డ కళ్ళు చారెడు అన్నట్టు…గుండె రాయి చేసుకో…నీ బిడ్డ స్వర్గానికి వెడుతుంది, వచ్చే ఏటికల్లా మగబిడ్డలా నీ ఒడి నింపుతుంది”
అదిలాదేవి పళ్ళ బిగువున ఓపిక తెచ్చి పెట్టుకుంటూ కీచుగా అరిచింది. “దాదమ్మా ఇటివ్వు నా బిడ్డని, ఇదిగో ఇటు చూడు…”అంటూ దిండుకింద నుంచి రెండువరసల చంద్రహారం బయటికి తీసి చూపించింది..
“లేదు తల్లీ తొలిచూలు ఆడ బిడ్డ చమన్ బస్తీలోనే ఎవరూ లేరు. నా పని నన్ను చేసుకొనివ్వు మూడు తరాలుగా మీ ఉప్పు తింటున్న దాన్ని…”అంటూ గదిమూలగా వున్న మట్టికుండలో బిడ్డను పండబెట్టి పురిటి మైల బట్టలు కప్పింది. పడక కుదరక బిడ్డ తన్నుకుంటూ ఏడుస్తోంది.
అదిలా దేవి ఏడుపు ఆపేసి ఒక నవ్వు నవ్వి రహస్యంగా అంది,
“పిచ్చి దాదమ్మా ఇది తొలిచూలు బిడ్డ కాదు”
“చాల్లేండమ్మా నిప్పులాంటి మనిషి మీరు, మమకారం కొద్దీ ఏదో చెప్పి కాపురం తీసుకోకండి.”కుండ పట్టుకుని లేచింది దాదమ్మ.
“ఔనూ ,నిజమే దాదమ్మా ఈ బిడ్డ నాకు మలిచూలు…”ప్రశాంతంగా చెప్పింది అదిలాదేవి.
మూసిన తలుపులు మోగుతున్నాయి ఆత్రంతొ….దాదమ్మ తలుపు తియ్యడానికి వెళ్ళింది.ఆ రెండు నిమిషాల్లోనే బిడ్డను కుండలోంచి బయటికి తీసి, “వెళ్ళు దాదమ్మా ఈ విషయమే చెప్పు బయట…” అంటూ ధడాల్న తలుపు వేసుకుంది. బిడ్డను గుండెలకు హత్తుకుంది, అలిసిపోయేంతవరకూ ముద్దులు పెట్టింది…రవిక ముడి తీసి పాలిచ్చింది.
బయట రావణ కాష్టం రగులుకుంటోంది.
“తలుపు తియ్యి ముందు…ఇంత మోసం చేస్తావా ? ఎవడి కొడుకే వాడూ…మొదటి వాడు ఎవడి కొడుకు, ఇప్పుడు పుట్టిన ఈ ఆడబిడ్డ ఎవరి కూతురు చెప్పు…తలుపు తీస్తున్నావా లేదా”-భర్త
“అయ్యో తలుపు తియ్యమ్మా బిడ్డ కోసం కాపురం తీసుకుంటావా పిచ్చిదానా….”ఏడుస్తూ తల్లి.
అదిలా దేవి పలకలెదు, ఉలకలేదు. కొంగుతో బిడ్డ వొంటిమీద పురిటి తడిని తుడుస్తూ కూచుంది.
(బీహార్ లొని చమన్ బస్తీలో ప్రతితొలిచూలూ మగబిడ్డే వుండటమేమిటనే ఆశ్చర్యంతో అక్కడి దాదిని ఆచూకీ తీసిన కార్యకర్త అనుభవం _ ఒక పాత ఆగ్ల పత్రికలో చిన్న వార్తగా చదివిన స్ఫూర్తితో)