Feb2008
ఫిబ్రవరి 2008 : సంపాదకీయం

Painting ‘Black History Month’

- లాం గ్స్టన్ హ్యూస్ : న్యాయం
అమెరికా లోకి వలస వచ్చే విభిన్న జాతుల ప్రజానీకం మధ్య సయోధ్య లేకుండా ఒకరికొకరి మధ్య ఉన్న వైరుధ్యాలని మరింత రెచ్చగొట్టి, జాతి వివక్షనూ, అపనమ్మకాన్ని, అసూయనూ, విభేదాల్నీ, అనుమానాలనూ పెంచి పోషించే సామాజిక చట్రం లక్షణాలు పాలితుల వైపు నుండి చరిత్రను అర్థం చేసుకుంటేనే పసిగట్టగలం. అమెరికాలో నివసిస్తున్న ప్రవాస భారతీయులమైన మనం ఈ నాడు అందరితో సమానంగా అనుభవిస్తున్న హక్కులు, స్వేచ్చాస్వాతంత్ర్యాలవెనుక ఈ దేశంలో నల్లవాళ్ళు చేసిన పోరాటాలు, అసమాన త్యాగాలు ఉన్నాయని తెలుసుకోవాలంటే చరిత్రను అణచివేయబడ్డ వారి దృష్టినుండి అర్థం చేసుకోవాలి. 50 ఏండ్ల కింద వరకూ సమాన హక్కులు గానీ వోటు హక్కు గానీ లేని ప్రజానీకం చేసిన పోరాటం ఈ దేశాన్ని పాలిస్తున్న పాలకుల జాత్యంహంకారానికి సవాలు విసిరిన వైనాన్ని, పోరాటం చేసిన వారి దృక్కోణం నుండి అర్థం చేసుకుంటేనే ఈ సమాజంలో మన బాధ్యతేమిటో మన స్థానమేమిటో తెలుస్తుంది.
రోజా పార్క్స్ , మార్టిన్ లూథర్ కింగ్ లాంటి వాళ్ళు హక్కుల కోసం శాంతియుతంగా పోరాటం చేస్తే, హుయె న్యూటన్ , బాబీ సీల్ , జార్జ్ జాక్సన్ , మాల్కం ఎక్స్ లాంటి వాళ్ళు బ్లాక్ పాంథర్ పార్టీ ఏర్పాటు చేసి హక్కులు మాత్రమే కాదు, అధికారాన్ని విప్లవాత్మకంగా, సాయుధంగా చేజిక్కించుకోవాలని పిలుపునిచ్చి పోరాటాలు చేసారు. 1960, 70 ల్లో ఈ పోరాటాలు తారాస్థాయికి చేరుకున్నాయి. సాధారణంగానే తమ ఆధిపత్యాన్ని, అధికారాన్ని కాపాడు కోవడానికి పాలకులు హక్కులు కొన్నైనా ఇవ్వక తప్పింది కాదు. అట్లా అమెరికా సమాజంలోకి ప్రవేశించే విభిన్న జాతుల వారికీ మెజారిటీ ఆధిపత్య సమూహాలకు సమానంగా అనేక హక్కులు అనుభవించే అవకాశం లభించి సమాజం మరింత ప్రజాస్వామ్యీకరించబడింది.కానీ క్రమేణా పెరుగుతున్న కార్పోరేటు ధనదాహం, అంతులేని లాభాపేక్షల ఫలితంగా సమాజంలో ఆర్థిక అంతరాలు మరింత పెరిగిపోయినయి. సహజంగానే తరతరాల బానిసత్వం కారణంగా తీవ్రమైన పేదరికానికి, వెనుకబాటుతనానికీ, జాతి వివక్షకీ గురయిన నల్ల జాతి ప్రజలు ఎవరో కొంతమంది అక్కడక్కడ పైకి వచ్చినా మెజారిటీ ఇంకా సమాజం అట్టడుగున్నే ఉండి దారిద్ర్యంలో, నేరమయ ప్రపంచంలో కొట్టుమిట్టాడుతున్నారనేది మనం విస్మరించరాని వాస్తవం.
ఈ విషయంలో భారతీయ సమాజం తో పోల్చినప్పుడు మనకు వెంటనే ఒక సారూప్యత గుర్తుకొస్తుంది. మన సమాజంలో తరతరాలుగా అంటరానివాళ్ళుగా వెలివేయబడ్డ దళితులకూ , అమెరికా సమాజంలోని నల్లవాళ్లకూ పోలిక కొట్టొచ్చినట్టు కనబడుతుంది. అయితే మనకక్కడ దళితులకు బానిసత్వం లేదు. నిజానికి దళితుల విముక్తి కోసం ముందుకొచ్చిన పోరాటాలు కొన్ని ఇక్కడి బ్లాక్ పాంథర్ ఉద్యమం నుండి స్ఫూర్తి పొందినవే! నల్ల జాతి వారి హక్కుల కోసం స్వేచ్చా స్వాతంత్ర్యాల కోసం నిరంతర పోరాటం సలిపిన యోధులందరికీ ప్రాణహిత వినమ్రంగా నివాళులర్పిస్తున్నది.
ఈ సంచిక లో ప్రాణహిత మీ కోసం మోత్కురి అశోక్ కుమార్ రాసిన కథ ‘నమ్మిక ’ ను అందిస్తున్నది. అట్లే అమెరికాలో, హైదరాబాదులో చేతికందిన కొడుకుల దగ్గర ఇమడలేని పల్లె తత్వాన్ని పట్టుకున్న బోధనం నర్సిరెడ్డి కథ ‘నీడ చెదిరిన గూడు ను చదవండి. 1920 ల్లో ప్రారంభమై ప్రపంచం లో కళా సాహిత్య రంగాలని ఒక కుదుపు కుదిపిన సర్రియలిజంను పరిచయం చేసే ఆడెపు లక్ష్మీపతి వ్యాసాన్ని చదవండి. చుట్టూ ఉన్న తోడేళ్ల నుండి తప్పించుకోవడమెలాగో చెప్పే ఫారుక్ సర్వర్ రాసిన పాకిస్తానీ కథ ‘తోడేలు ’ ను డా||దేవరాజు మహారాజు అనువాదంలో చదవండి.
జాజుల గౌరి రాసిన ‘దళిత రాజ్యం నూ , డా||దేవరాజు మహారాజు రాసిన ‘రేప్ చేయబడ్డ నగరం కవితనూ , బి. వేణుగోపాల్ రెడ్డి ‘ఉరుకుతున్న గంగ నూ, వఝల శివకుమార్ ‘తెలంగాణ దండోరా ను, కోసూరి విజయకుమార్ ‘పడవ కాలిపోతోంది ’ ని, లద్దిగిరి శిరి ‘వెనకడుగు ’ను, లాం గ్స్టన్ హ్యూస్ ప్రజాస్వామ్యం నూ కవితల్లో చదవండి.
ప్రాణహిత కోసం రాస్తున్న ‘చౌరస్తా’ లో ఈ సారి అమెరికా రాష్ట్రపతి ఎన్నికల్లో అభ్యర్థుల గురించి హిమబిందు వ్యాఖ్యల్ని చదవండి. మమత ప్రతి నెలా అనువాదం చేస్తోన్న మేరీ బ్రేవ్ బర్డ్ ‘లకోట వుమన్ ’ ఐదవ అధ్యాయం చదవండి. కొడవటిగంటి రోహిణీ ప్రసాద్ రాస్తున్న శాస్త్రీయ వ్యాస పరంపర లో ఆఖరి భాగం ‘సూక్ష్మజీవుల ప్రతాపం ’ ఈ సంచికలో అందిస్తున్నాం.
ఎప్పటిలాగే ప్రాణహితను ఆదరిస్తారని… చర్చని సాగిస్తారని మా విన్నపం.