Mar2008
తెలంగాణ బతుకులకు “మూలకం”
హృదయాన్ని స్పందింపచేసే కవులు కొందరే ఉంటారు. వారిలో కొందరు మాత్రమే ప్రత్యేక భావజాలంతో, నూతన అభివ్యక్తితో కవిత్వాన్ని రాస్తారు. వారు మనుషులను జాగృతం చేస్తారు. వారి లక్ష్యం సమ సమాజ నిర్మాణం. విశ్వమానవ కళ్యాణం. ఈ రకం కవులలో చెప్పవలసిన కవి ఎస్.హరగోపాల్. నిశితమైన చూపు, పదునైన భావజాలం ఉన్నవాడు.
హరగొపాల్ కవిత సంకలనం “మూలకం” ఈ విషయాన్ని మరింత ముందుకు తీసుకువెలుతుంది. మనిషి తన స్వప్నమని ప్రకటిస్తూ వస్తున్న కవి, ఆధునికుడు హరగోపాల్. కవి అంటే గాయం గుండె. కవిత్వం అంటే గాయాల గొంతుక. హరగోపాల్ గుండె గాయాన్ని గురుతుపట్టిన కవి. ఈ కవి తన కవిత్వానికి మనిషిని కేంద్రబిందువుగా చేసుకున్నాడు. మనషే తన కల అంటున్నాడు. హరగోపాల్ పల్లెల మట్టి వాసన తెలిసిన వాడు. పల్లెలను కళ్ళార చూస్తున్నవాడు.
వట్టిపోయినా పల్లెలను, ఎడారిగా మారిపోతున్న పల్లెవిషాదాలను తెలంగాణ వలసలను, పొట్టచేత పట్టుకొని వలసవెళ్ళే నిత్య సన్నివేషాలను చిత్రిక పట్టాడు.
“ఊరికి తలుపులెక్కడి విప్పుడు
చప్పుడు చేయడానికి?
అంతా వలసేనాయే!
దిగులుపరచుకుపోయిన దిబ్బేనాయే!
కరువు మీద కరువు దెబ్బేనాయే!”
ఈ కవిత సంపుటిలో మొదటి కవిత “తలుపు చప్పుడు”. మాట స్పర్ష కోసం ఎదురుచూసే మూగవేదనంతా ఆవిష్కృతమైంది ఈ కవితలో…..
“పాలిచ్చేయాల్లకు అమ్మొచ్చిన సంతోషం
కాడ మల్లెపూలు ఒల్లో దాసుకున్నంత మురిపెం
నువ్వొస్తె!!”
“నువ్వొచ్చి కండ్లముందర
ఒక్కఒద్దన్న వుంటేనే నాకు నిమ్మళం”
“కుక్కపిల్లై నా మనసు నిన్ను పసిగడ్తు
దినాలు గడుపుతుంటుంది”
నువ్వొస్తవో…..రావో…..
యుగళగీతం అను కవితలో కొత్తగా, పదునైన కత్తిలా సత్యాన్ని ఎలా ప్రతిపాదిస్తున్నాడో చూడండి.
“పాదాలు రెండు కుక్కపిల్లలు
దారినెపుడు మరిచిపోవు
మనసు ప్రవహించగానే విశ్వాసంగా
గమ్యానికి చేరుస్తాయి”
హరగోపాల్ కవిత్వానికి మనిషే ప్రాణస్పందన. తను చేరుకునేసరికే మనిషి గాయమై వున్నాడు. మనిషి అనుభవాలు తను. ఎక్కడో తప్పిపోయిన ఆత్మీయాన్ని ఎక్కడో దొరకబుచ్చుకున్న ఆనందం. పెద్ద చిన్న శరీరానికే. హృదయానికి కావు. అదే కవి. వయసు మరిచి వ్యక్తీకరిస్తాడు.
“బురదలో ఆడుకొంటున్న పసివానిలా నేను నీలో
పిచ్చుక గూట్లోకి నీ పాదం కోసం
గుండెల గుంపుల్లో వెతుకులాట
వొల్లంత పుసుకున్న ఇసుకలా గ్నాపకాలు”
బాల్యాన్ని తడిగుర్తుగా దాచుకొని ఇప్పటికి బాలుడు కాగలిగిన వాళ్ళకే ఈ వ్యక్తీకరణ అందుతుంది.
ఆకలి తెలిసిన కవి. అమ్మనెరిగిన కవి. ఆకాశమంత పందిరి అంటామే దాన్ని మించిన అద్భుత భావన చేసినాడు.
“భూగోళాన్ని
అరచేతిలో వొత్తి
రొట్టెలా కాల్చి
బిడ్డలకడుపునింపే తల్లీ నువ్వు అమ్మవే ”
హరగోపాల్ గొప్పభావుకుడు. అతని భావనలకు పై పద చిత్రం మంచి సాక్ష్యం. అంతేకాదు భావదారిద్ర్యాన్ని కూడ బలంగా ఎత్తిచూపినాడు. మాటల చమత్కారం మాత్రమే కాదు. ఒక ఎడతెగని చింతనవుంది. “దారిద్ర్యరేఖ దిగువ కన్నా కోట్లాది జనం భావదారిద్ర్యరేఖ దిగువనే ఎక్కువ” అంటాడు. పగిలిన అద్దం చుట్టు ఎంత జీవితం అందుకోవచ్చునో “చిరిగిన ఉత్తరం” చుట్టు అన్ని
గ్నాపకాల్ని ఏరుకోవచ్చు.
“కొలిమి కొలిమిగానే వుంది
కష్టం బూడిదకుప్పలెక్కనే వుంది
కల్లంలో కొంగుసాపిన చేటెడు బిచ్చం లెక్కనే వుంది”
వర్గసమాజ దృష్టి హరగోపాల్ ప్రతి అక్షరంలో కనిపిస్తది. చేతికి ముద్దలేని చేతివృత్తులు, బరకతులేని రెక్కల కష్టం ఎంత యాతన పెడుతున్నాయో చిత్రించినాడు. కొలిమి అంటె బతుకు కొలిమి మండుతనే ఉంటది. బతుకు కాఠిన్యాన్ని మాటలతో ముట్టుకునే ప్రయత్నం చేసిండు కవి.
ప్రపంచీకరణ మాయజాలం మనిషిని ఆవరిస్తున్నది. ఇప్పుడు మనిషిని పోల్చుకోవడమే కష్టం. ఇగ మనిషిని చేరుకోవాలంటే మాములు కష్టం కాదు. ఊరు దయ్యం పట్టినట్టు మూలుగుతున్నది.
“ఉయ్యాలకట్టిన అమ్మకొంగుతో సహా వేపచెట్టు మాయం
ఒరందిగిన అమ్మ పొలంల దిగవడ్డది
నాట్లులేవు కోతల్లేవు భూమి పుండువడ్డది”
కవి ప్రపంచాన్ని మనసునిండా పట్టించుకుంటాడు. నిజాలు చూసి నిజాలు రాసి నిండు జీవితాలిచ్చిన చరిత్రకర్తలు కవికి దగ్గరివాళ్ళు. అందుకే కవిత్వంలో వస్తువులు అయ్యారు.
“వాడు ప్రపంచాన్ని పట్టించుకోవడం షురూ చేయగానే
వాణ్ణి చూడటానికి భయమేసింది
వాడు నేలవిడిచి కత్తుల వంతెన కడ్తున్నప్పుడే అనుకున్నా
వాడింక దక్కుతడో లేడోనని”
అక్షరాలు నమ్ముకున్నవాళ్ళు, కాలాన్ని ఎదిరించిన వాళ్ళు కవి అభిమానాన్ని పొందారు. క్రూరసామ్రాజ్యం చేసే కుట్రల్ని కవి వ్యంగ్యంగా చెప్పినాడు. నిజాలు రాసినందుకు ఎన్కౌంటరైన రసూల్ ను కవి మర్చిపోలేదు. అతని లాంటి ఎందరో తెలంగాణ జీవన చిత్రణ ఇది.
“బుగులు జరమొచ్చినట్లుంది తెలంగాణలో ఇప్పుడు గూడ
రజకార్ల గుర్రాలదండ్లే తిరుగుతున్నట్లుంది
తెగిపోయిన తల్లిపుస్తెల్ని పిల్లలేరుతున్నరు”
ఎన్నో ఏండ్లుగా తెలంగాణది విషాదచిత్రం. వీరచరిత్రం. నెత్తురు మడుగులై పారినా శాంతి రాలేదు. బతికినా చచ్చినా పల్లె బుగులు బుగులే.
“నివద్దె నువ్ జెప్పింది నిజం
ఈడ బతుకులు నిమ్మలంగ లేవు
ఈడ సావులు సాపుగ రావు
ఈదంతా అడ్విల అగ్గిబడ్డట్టే”
తెలంగాణల సహజ మరణాలు లేక చాల రోజులైంది. హత్యలైనా ఆత్మహత్యలైనా ఎన్కౌంటర్లయినా ఏవి సహజమరణాలు కానేకావు.
ఒక్కమాటలో “మూలకం” సంభాషించని అంశమంటూ, ఈ కవిత్వ సంపుటిలో లేదు. మనిషి తన
స్వప్నమని ప్రకటిస్తూ వస్తున్న కవి హరగోపాల్ కవిత్వం విషయంలో మరి ఇంత పిసినారితనం పనికిరాదు. మొత్తానికి హరగోపాల్ కవితలు తెలంగాణ కవిత్వానికి, తెలంగాణ బతుకులకు “మూలకం”. మూలకం అంటే తెలంగాణలో కారణం అని అర్థం.
ప్రాణహిత » మార్చ్ 2008 సూచిక Apr 10, 2008 1
[...] తెలంగాణ బతుకులకు “మూలకం” – వెంకటేష్ [...]