Feb2009
సైన్సు రచనల్లో వివరాలు అవసరమా?
భౌతికవాదాన్నీ, హేతువాదాన్నీ సమర్థించేవారు విజ్ఞాన విషయాలను తేలికభాషలో అర్థం చేసుకోవడం మంచిదేనని అంగీకరిస్తారు. ఇది నిజమే అయినప్పటికీ ఒకరకంగా చూస్తే వైజ్ఞానిక దృక్పథం అవలంబించడం, సైన్సుపట్ల ఆసక్తి ఉండడం వగైరాలు ఒక ఎత్తూ, నడుం బిగించి సైన్సు వివరాల్లోకి దిగడం మరొక ఎత్తూ అనిపించవచ్చు. అయితే కొన్ని వివరాలైనా తెలియకుండా సైన్సును ‘నమ్మడం’ మతాన్ని నమ్మినట్టే అవుతుంది. ప్రగతిశీలభావాలు కలిగిన పత్రికలూ, పాఠకులూ సైన్సు రచనలను ఆదరిస్తారనడంలో సందేహంలేదు. ఈ వివరాలు ఏ స్థాయిలో ఉండాలి? నా మటుకు నేను సైన్సు విషయాలను పదోతరగతి విద్యార్థి స్థాయిలోనే తెలుసుకుని ఆనందిస్తాను. వ్యక్తిగతంగా చెప్పాలంటే నా జీవశాస్త్ర అధ్యయనం 1964లోనే, స్కూలు దశలోనే ఆగిపోయింది. ఈనాటి ఆసక్తికరమైన పరిణామా లన్నిటినీ నేనుకూడా పాఠ్యేతర పుస్తకాలూ, రచనలనుంచే తెలుసుకుంటున్నాను. ఈ విషయాల్లో కొంత అస్పష్టంగా ఉన్న నా అవగాహనకు ఇది చాలా మంచి చేస్తోంది.
సామాన్యపాఠకులు ఎక్కువగా పట్టించుకునేవి నిత్యజీవితపు సమస్యలే. సామాజికస్పృహ కలిగిన రచనలు ఈ సమస్యలకుగల సాంఘిక, రాజకీయ నేపథ్యాన్ని వివరిస్తాయి. సమాజంలో తలెత్తే వైరుధ్యాలూ, సంఘర్షణలూ మానసికమైన అలజడినీ, ఉద్వేగాన్నీ కూడా కలిగిస్తాయి. ఈ సందర్భంలో ప్రకృతిలో సహజంగా జరుగుతున్న పరిమాణాలకు భావవాదులు ఆధ్యాత్మిక వివరణలివ్వడం మరింత ఆగ్రహం కలిగిస్తుంది. ఇటువంటి కుహనామేధావులను తెగనాడటానికీ, వాస్తవికమైన అవగాహనను కలిగించడానికీ సైన్సు ఒక ఆయుధంగా పనికొస్తుంది. అయితే ఆ ఆయుధానికి తగుమాత్రం పదు నుండాలి. లేకపోతే ఎదురుదాడి సరిగా జరగదు.
ఉదాహరణకు మన శరీరాల్లోనూ, ఇతర ప్రాణుల్లోనూ నిత్యమూ జరిగే జీవపరిణామ ప్రక్రియలన్నీ ఎలా జరుగుతాయి? ప్రాణులు ఎలా పెరిగి పెద్దవౌతున్నాయి? మనుగడకు అత్యవసరమైన ప్రోటీన్ల తయారీ ఎలా జరుగుతోంది? వివరాల్లోకి వెళితే తెలుస్తుంది: ఇదంతా ఎంతో యాంత్రికంగా, ఎవరి ప్రమేయమూ లేకుండా, అచ్చమైన భౌతిక, రసాయనిక మార్పులద్వారా జరుగుతూనే ఉంటుంది. ఇంతేకాక మనకు కలిగే భావాలూ, ఊహలూ, స్పందనలూ అన్నీ ఎలా కలుగుతున్నాయో, పుట్టక మునుపూ, చచ్చిపోయే లోపలా ఏమేం జరుగుతోందో కొంతైనా వివరాలతో సహా తెలుసుకోవడం అద్భుతంగా అనిపిస్తుంది. ప్రాణులు చెయ్యవలసిందల్లా గాలి పీలచడం, తిండి తినడం మాత్రమే. కంప్యూటర్లోకి దోపిన సీడీ రాం తన పని తాను చేసుకుంటూ పోయే పద్ధతిలోనే జీవరసాయనిక ప్రక్రియలన్నీ అతి సూక్ష్మస్థాయిలో జరుగుతాయి. ఈ విషయాలను మాటిమాటికీ గుర్తుచేస్తూ ఉంటే దేవుళ్ళలోనూ, దైవఘటనవంటి అర్థంలేని భావనలమీదా నమ్మకం బలహీనపడు తుందని ఆశించవచ్చు.
స్కూల్లో చదువుకున్న ఇటువంటి విషయాలు కొన్నేళ్ళ తరవాత గుర్తుంటాయని నమ్మకం లేదు. అంతేకాక పాఠాల్లో విషయాల వివరణ ఉన్నప్పటికీ మన అవగాహనను మార్చే ప్రయత్నమేమీ కనబడదు. ఏది ఏమైనా పాఠ్యపుస్తకాల దారి వేరు; పాప్యులర్ సైన్స్ రచనల దారి వేరు. మరొక టేమిటంటే ఈ రచనలు పత్రికల్లో చదివినప్పుడు ఒకరకమైన పాఠకులనూ, పుస్తకంగా వెలువడినప్పుడు మరొకరకమైన పాఠకులనూ ఆకర్షించే అవకాశం ఉంటుంది. పత్రికల్లో కథలూ, కవితలూ, వివిధ విషయాల గురించిన వ్యాసాలూ, వార్తలూ అన్నీ ఉంటాయి. ఎవరికి నచ్చినది వారు చదువుకుని తక్కినవి ‘స్థాలీపులాక న్యాయ’ పద్ధతిలో వీక్షిస్తారు. సైన్సు వ్యాసం చదువుతున్నవారు సైతం ‘అయితే ఏమిటంటాడూ?’ అని ఆలోచించడం సహజం. అందువల్ల ఈ ఆసక్తిని పాఠకులతో సరిగా పంచుకోలేని రచయిత అసమర్థుడనిపించుకుంటాడు. విషయవివరణతోబాటు తన సామాజిక దృక్పథాన్ని అక్క డక్కడా ప్రకటించే ప్రగతిశీల రచయిత పత్రికల పాఠకుల మెప్పును పొందే అవకాశం ఉంటుంది.
మరొకవంక తమకు ఆసక్తి ఉండడంవల్లనో, తమ పిల్లలకు పనికొస్తాయనో సైన్సు పుస్తకాలు దుకాణాల్లో కొనేవారు సైన్సుకుగల సామాజిక దృక్పథంకన్నా విషయానికే ఎక్కువ ప్రాధాన్యతనిస్తారని ఊహించవచ్చు. జీవశాస్త్రవిజ్ఞానంకాని, అంతరిక్షశాస్త్రంగాని సులువుగా తెలియజెయ్యగలిగిన పుస్తకాలనే వారు ఎంపిక చేస్తారు. మూఢవిశ్వాసాలను తెగనాడే ధోరణిని వారు అంతగా పట్టించుకోక పోవచ్చు. తెలుగులో సైన్సు రచనలు అసలే తక్కువ. అందుకని ఇటువంటి రచనలు చేసేటప్పుడు పై విషయాలన్నిటినీ గుర్తుంచుకోవడం అవసరం. కష్టపడి విషయసేకరణ జరిపి, సులువుగా అర్థమయేలా వ్యాసం రాసినవాడికి నాలుగు లైన్లలో ఏ మాత్రమూ స్పష్టత లేకుండా కవిత రాసి పంపే కవులకు వచ్చిన గుర్తింపులో శతాంశం కూడా రాదనేది వేరే సంగతి.
వాస్తవప్రపంచంలో కనబడుతున్న విషయాలకన్నా కాల్పనిక రచనల్లోని సంఘటనలు నిజంగా ఎక్కువ ఆసక్తికరమైనవేనా అని అప్పుడప్పుడూ అనుమానం కలుగుతుంది. భౌతికవాదులకు పదార్థం ఎంత యథార్థమైనదో తెలిసినదే. భూగోళంమీద తలెత్తిన తొలి జీవకణాల్లోనూ, తొట్టతొలి ఏకకణ, బహుకణజీవుల్లోనూ ఉండిన అణువులన్నీ ఇప్పటికీ భూమిమీదే ఉన్నాయని గుర్తుంచు కోవాలి. అవి ఎన్నిరకాలుగా, ఎన్నిసందర్భాల్లో, ఎన్నిసార్లు పరస్పరం కలిసి, ప్రాణులుగా రూపొంది నప్పటికీ చివరకు ఆ ప్రాణులు చచ్చిపోయాక భూమిమీదే పడి ఉంటాయి. నేలనుంచి మొక్కల్లోకీ, వాటినుంచి జంతువుల శరీరాల్లోకీ మళ్ళీమళ్ళీ ప్రవేశిస్తూ ఉంటాయి. బూటకపు వేదాంతులు ఆత్మలు శాశ్వతం అంటారుగాని నిజంగా శాశ్వతమూ, అనశ్వరమూ అనిపించేది అణువే. మరొకటేమిటంటే ఈ అణువుల్లో అంతర్నిర్మాణం ఉన్నప్పటికీ అణువులు పగలని కోడిగుడ్లలాగా మొత్తంగానే కొనసాగుతూ ఉంటాయి.
ఇలాంటి విషయాలు పాఠ్యపుస్తకాల్లో ఉండవు. అలాగే శరీరశాస్త్రానికీ, సామాజికశాస్త్రానికీ గల సంబంధం చరిత్రలో మారుతూ వచ్చిన పారిశుద్ధవ్యవస్థలవంటివి తెలియజేస్తాయని చెప్పేవి పాప్యులర్ సైన్స్ రచనలే. గతంలో లక్షలమందిని చంపిన అంటురోగాల నివారణకు చిన్నపిల్లలను బలి ఇచ్చిన గొప్ప నాగరికతలెన్నో ఉండేవి. వాటి మూలకారణాలు తెలియకపోవడానికి మైక్రోస్కోప్లవంటి పరికరాలు లేకపోవడమే కారణమై ఉండవచ్చు. ఇది తెలిస్తే ఈనాడు రోగాలొచ్చినప్పుడు మొక్కులతో సరిపెట్టుకోకుండా ఉండే ధోరణి పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే యుద్ధాలు జరిగిన కాలాల్లో టెక్నాలజీ ముందంజ వేసిందని సైన్సు రచయితలు గుర్తుచెయ్యాలి.
ప్రకృతిని గురించిన కుతూహలం యువతలో ఎక్కువగా ఉంటుంది. సైన్సు పుస్తకాలు ఇంగ్లీషులోనూ, సైన్సు సమాచారం ఇంటర్నెట్లోనూ విరివిగా అందుబాటులో ఉన్నప్పటికీ తెలుగువారు అవి చదువుతారని అనుకోలేము. యువవిద్యార్థినీ విద్యార్థులకు ప్రాథమిక స్థాయిలో నైనా ఆసక్తిని రేకెత్తించే పని పాప్యులర్ సైన్స్ రచనలే చెయ్యాలి. మార్కుల కోసమని కాకుండా, జిజ్ఞాస కొద్దీ నేర్చుకునే పద్ధతిలో ఇవి వారిని ఆకర్షించాలి. ఆ లెక్కన చూస్తే సైన్సు రచనలను బాల సాహిత్యంగా పరిగణించాలేమో.
పాఠకుల్లో ఒక శాతం మాత్రమే సైన్సు రచనలు చదువుతారనీ, దేన్నైనా చదివిన పాఠకుల్లో ఒక శాతం మాత్రమే తమ అభిప్రాయాన్ని రాతపూర్వకంగా తెలియజేస్తారనీ అనుభవజ్ఞులైన సంపాదకుల ఉద్దేశం. అందుచేత సైన్సు రచయితలు ‘క్యూ’లో చిట్టచివర ఉంటారని అనుకోవచ్చు. అయినా పట్టువదలని విక్రమార్కుళ్ళా వాళ్ళని రాయటానికి పురికొల్పేది వారికిగల ఆసక్తి ఒక్కటే.
ఒక అభిప్రాయం »ప్రత్యేక వ్యాసాలు, సైన్స్
March 1st, 2009 at 10:28 pm
[...] సైన్సు రచనల్లో వివరాలు అవసరమా? : డా. కొడవటిగంటి రోహిణీప్రసాద్ [...]