Mar2009
తెలంగాణ వైతాళికుడు వట్టికోట ఆళ్వార్స్వామి 48వ వర్థంతి సభ
తెలంగాణ వైతాళికుడు వట్టికోట ఆళ్వార్ స్వామి వర్ధంతి సభ 5-02-2009న హైద్రాబాద్లోని ప్రోగ్రేసివ్ మీడియా సెంటర్లో జరిగింది. తెలంగాణ హిస్టరీ సోసైటీ మరియు తెలంగాణ జాగృతి సంయుక్తంగా ఈ సమావేశాన్ని నిర్వహించాయి. ఈ సమావేశానికి తెలంగాణ హిస్టరీ సోసైటి సభ్యుడు వివేక్ గారు అధ్యక్షత వహించారు.
మొదటి వక్త అయిన తెలంగాణ చరిత్ర పరిశోధకులు జితేంద్రబాబు మాట్లాడుతూ 1938-42 ప్రాంతంలో వట్టికోట ఏం చేశాడో పరిశోధన జరగవలసి ఉన్నది అని అన్నారు. ఆంధ్రమహాసభలో ఘర్షణ జరుగుతున్నప్పుడు కొత్త తరంవైపు నిలబడ్డ ఆళ్వారు స్వామి రైతాంగ, కార్మిక, సంఘాలకు మద్దతుగా వైర, పాలేరు లాంటి నీటి ప్రాజెక్ట్లమీద కృషి చేశారు. అని ముగించారు. ప్రముఖ పాత్రికేయుడు విరసం సభ్యుడు ఎన్. వేణుగోపాల్ మాట్లాడుతూ “ ప్రతి ఒక్క మనిషి చరిత్రను చరిత్రపుటల్లోకి ఎక్కించాలి. ఆ దిశగా వట్టికోట కృషి చేసి 60 సవత్సరాల గడుస్తున్నా మిగిలిన పనిని ఇప్పటి తరం అందుకోలేదని అభిప్రాయపడ్డారు. వట్టికోట ప్రతిభావంతమైన వ్యక్త్తిత్వం, సంక్లిష్ట సామాజిక జీవితం గొప్ప వైతాళికుడు కావడానికి దోహదపడ్డాయి. తెలంగాణ అస్థిత్వాన్ని గుర్తిస్తూ రెండు సంపుటాలు తెచ్చిన గొప్ప అంకితశీలి వట్టికోట. 1969లో జరిగిన పోరాటలో సాహిత్య సాంస్కృతికి వికాసం అంతగా జరగలేదు ఒక్క పాట సంకలనాన్ని వదిలిపెడితే. రద్దయిన తెలంగాణ తల్లిని వెలికి తీయవలసిన అవసరం ఉన్నది. తెలంగాణ ప్రజల పక్షాన 2015 వట్టికోట శత జయంతి వరకు సమగ్ర సాహిత్యం తీసుకురావలసిన అవసరం ఎంతైనా అన్నదని “ అన్నారు.
విప్లవ కవి వరవరరావు ప్రసంగిస్తూ, “ తాను సాహిత్యం నుంచి రాజకీయాల్ని చూసిన వ్యక్తిగా ఆళ్వార్ స్వామిని అర్థం చేసుకునే ప్రయత్నం చేశాను. సృజనాత్మక రచయితా కార్యకర్త కావలసిన అవసరాన్ని ఆళ్వారు స్వామి గుర్తించాడు. ఇప్పుడు పెద్ద సమస్యగా ఉన్న భూమి సమస్యను వట్టికోట తన ‘ప్రజల మనిషి’ నవలలో పరిష్కారం ఆనాడే సూచించాడు స్త్రీపురుష సంబంధాలు, మతానికి సంబంధించిన పరిష్కారాలు చాలా గొప్పగా వివరించారు. అటువంటి వట్టికోట ఆళ్వార్ స్వామి స్ఫూర్తితో తెలంగాణ ఉద్యమం ప్రజా ఉద్యమంగా మారి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దిశగ అడుగులు వేయాలని” అన్నారు. ఈ సమావేశంలో సంగిశెట్టి శ్రీనివాస్ ప్రసంగిస్తూ “వట్టికోట ఒక్కడే వేలమంది చేసేపని చేశాడని తెలంగాణ మేధావులంతా కూడి ఒక్క పనిని పూర్తి చేయకపోవడం శోచనీయం” అన్నారు. తెలంగాణ జాగృతి కన్వీనర్ కె. కవిత మాట్లాడుతూ “ ఇన్ని రోజులు థాట్ పోలిసింగ్ జరిగింది. వట్టికోట లాంటి వారి రచనల్ని మా తరం తెలుసుకోవడానికి ఈ సమావేశం ఉపయోగపడింది. తెలంగాణ జాగృతి. తెలంగాణ చరిత్ర సంస్కృతుల్ని వెలికితీసే దిశగా డాక్యుమెంటేషన్ ప్రోగ్రాం తీసుకున్నదని” ఈ సందర్భంగా ఆమె వివరించారు.
అభిప్రాయాలు లేవు »సాహిత్య వార్తలు