Mar2009
కొత్తపల్లి- ఒక జ్ఞాపకం, ఒక నివాళి
కవిగా కొత్తపల్లి సత్యశ్రీమన్నారాయణను నేను 1974లో ఆయన ”వెలుతురు పిట్టలు” కావ్యాన్ని రాసినప్పటినుండి ఎరుగుదును. నా కంతకుముందు పరిచయంలేని ఈ కవి రాసిన ఈ కావ్యాన్ని చదివినప్పుడు ఒక మంచి కవిత్వాన్ని చదువుతున్నానన్న అనుభూతి కలిగింది. అందుకే అనిపించింది. కొత్త పల్లిలా నిజమైన కవిత్వం చెప్పగలిగినవాళ్ళు తెలుగు దేశంలో ఒకరిద్దరు మాత్రమే ఉన్నారు’. అని గుంటూరు శేషేంద్రశర్మ లాంటి వాళ్ళు ఆ కావ్యాన్ని మెచ్చుకొనడం అతిశయోక్తికాదని. ఆ తర్వాత కొన్నాళ్ళలో ఆయన రాసిన ”అక్షరంలో అంతరిక్షం” (1995) ”స్వస్థాన మిత్రుడు’ 2006 ”వామన విశ్వం” 2007 చదివినప్పుడు అదే అనుభూతి. ఆయన తాను ప్రచురించి పుస్తకాలన్నింటినీ నాకు ఆప్యాయంగా ఇచ్చినాడు. ఆయన నాకు ఇవ్వని తనపుస్తకం ఒకే ఒక్కటి, అది – తాను చనిపోయిన నాటికి ముందు సాయంత్రం అవిష్కరణ జరిగిన ”వెలుతురు పిట్టలు” కావ్యం పునర్ముద్రణ పుస్తకం (డిసెంబర్ 2008) ఇక- నాకు ఆ అవకాశం మళ్ళీరాదు.
రాజమహేంద్ర వరంలోని శ్రీమన్నారాయణ మిత్రులకు పాతకాలెండర్ మారి కొత్త కాలేండర్ వచ్చినప్పుడల్లా అతను గుర్తుకువస్తాడు. ఎందుకంటే సరిగ్గా ఆరోజున ఆ కవి వయస్సును కాలచక్రం మరొక సంవత్సరం అధికం చేస్తుంది. ఎన్ని పని వత్తిడులు ఉన్నా ప్రతి డిసెంబర్ 31 వ తేది రాత్రి ఆయన తన మిత్రులతో ఆనందంగా కాలక్షేపం చేస్తాడు. ఎప్పటి లాగానే 2008 సం. డిసెంబర్ 31వ తేది రాత్రి కూడా (ఆనాటి సాయంత్రం ”వెలుతురుపిట్టలు” కావ్య పునర్ముద్రణ ఆవిష్కరణ ఘనంగా జరిగిన తర్వాత) సాహితీ మిత్రులతో గడిపి అందరి సెలవూ తీసుకొని, యింటికి వచ్చిన కాసేపటికి శాశ్వత నిద్రలోకి జారి తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయాడు. ప్రక్కరోజు పొద్దున శ్రీమన్నారాయణ ఇక లేడు అనే నమ్మలేని వార్త సాహితీ లోకంలో గుప్పుమంది.
శ్రీమన్నారాయణ మంచి కవి మాత్రమే కాదు. మంచి చదువరి కూడా. ఆంగ్లంలో వచ్చిన ఎన్నో కొత్త సాహితీ గ్రంథాలను, సైన్స్ రాజకీయ తత్వశాస్త్రాలకు సంబంధించిన పుస్తకాలను ఆయన ఎప్పటికప్పుడు చదివి తనమేధస్సును పదును పెట్టుకుంటుండే వాడు. ఈ కారణం చేత శ్రీమన్నారాయణ నలుగురి మధ్య సంభాషిస్తున్నా, సభలో ప్రసంగిస్తున్నా తన ప్రత్యేకత నిలుపుకోగలిగేవాడు.
ఈ ”వెలుతురు పిట్టలు” కవి గురించి చెప్పదలిచినప్పుడు అతడి కవితలు కూడా గుర్తుకు రావడం సహజం.
”వాడు తోలుకొని వచ్చె
వందజ్ఞాపకాల ఆవుల మంద
నా తనువు చెఱవును తాగుతుంటే
పలుకరింపుల కెరటాలతో పరవశించాను”
అంటూ అతడు ‘స్వస్థాన మిత్రుడు’ కవితలో తాను వూరినుంచి తన రాష్ట్రంనుంచి, తనదేశం నుంచి, వచ్చిన వ్యక్తి, తారసిల్లినప్పుడు ఒక ప్రవాసి గుండెల్లో ఉప్పొంగే ఆనందానికి అక్షర రూపం యిచ్చినా (యిలాంటి ఆనందంతో నే కాదు అతడు ఆక్షణంలో ”ధబీల్మని ముంజెకాయల గెలకింద చప్పుడు” వినగలిగిందే? అదే కవితలో)
”అంకెలగానుగు గడియారం,
నా మణికట్టుమండలం మీద
ఒక యంత్రంతో స్థావరం”
అని ఆవేదన చెందినా, ”అగణిత కాలంలో అగణిత సౌందర్యంకోసం” అన్వేషించినా అన్నింటా అతడిలోని ఒక భావుకుడిగా దర్శన మిస్తాడు. సర్వాన్ని కవితమయంగా చూడగల రస హృదయుడతడు.
లేకుంటే విద్యుత్కేంద్రాలమీద, విద్యుత్తీగలమీద కవితలల్లగలడా?
”భవ పరిమళు’ అనే కవితలో ”ఎక్కడైనా ఎప్పుడైనా
వ్యక్తమయ్యె భూధర్మంలా ప్రాణదోహదాన్ని మృత్యురహస్యాల్ని
ప్రసరించే తీగ
తీగలు సాగినంతమేరా విద్యుద్భాష వికసించి
పురాజరాయాతన తగ్గి
కొత్త కళలు వెలిగి మనం
మిలమిలల తలంలో మేల్కొంటాం”
అంటాడు ‘విద్యుద్భాష’ తెలిసినకవి, వృత్తి రీత్యా ఇంజనీర్గా పనిచేసినవాడు, అయిన శ్రీమన్నారాయణ.
”వస్తువుకానిదేదిట
భవన్నయాగ్ని శిఖచ్ఛటార్భటిన్ వాస్తవమై రూపరసవాసన లేనిదేది
మేర్మివై నేస్తము కాని దేది”
నేటి కవిగా ఆయన దృష్టి (వస్తుకానిదేది/ కవితలో)
”కన్నీటి బిందువై
కవిత కురిసింది” (కన్నీటి బిందువు’ కవితలో)
అని చెప్పుకున్న కొత్తపల్లి రసస్లావితమైన హృదయంతో విన్న మంచి కవితలు రాశాడు. అతడు రాసిన నాలుగు కవితాసంపుటాలు ఇవాళ లభ్యతలో వున్నాయి. సాహితీ ప్రియులు వాటిని చదివి పరశించగలరు. అదే అతడికి మనం ఇవ్వగల కన్నీటి నివాళి.