Jun2009
జీవజలం చలం
తేది 18-05-2009న చలం 115వ జయంతి సందర్భంగా చలం భావన ఆధ్వర్యంలో సమావేశం ప్రెస్క్లబ్లో జరిగింది. చలం భావన బాధ్యులు నాళేశ్వరం శంకరం మాట్లాడుతూ సాంప్రదాయ అడ్డుగోడల్ని బద్దలు చేసేవిధంగా చలం రచనలు ఉన్నాయి, స్త్రీ పాత్రలు చాలా చైతన్యంతో కూడుకున్నవని అన్నారు.
చలం రచనల మీద ప్రముఖ రచయిత్రి వి. ప్రతిమ మాట్లాడుతూ “ చలం తన రచనల్లో అత్యంత సహజంగా జరగాల్సిన, అనుభూతి పొందాల్సిన మానవ సుఖాలు,పాపకార్యాలు కావని వివరించాడు. దానికి సాహిత్యాన్ని ఉపకరణంగా వాడుకుంటూ తన రచనల ద్వారా ఈ విషయాల్ని చెప్పాడు. స్త్రీ హృదయానికి మంచి అనుభవం ఇవ్వాల్సిన అవసరం ఉన్నదని గ్రహించాడు. శశిరేఖ హృదయ ధర్మమే చలం హృదయ ధర్మం అయింది. స్వేచ్చ అనే పదాన్ని సరిగ్గా అర్థం చేసుకొని నిర్వచనం ఇచ్చిన గొప్ప రచయిత చలం “అని ప్రతిమగారు అన్నారు.
చలం ప్రేమికులు ఎవరూ లేచిపోరు, ఇష్టపడి పోతారని చలం రచనల్లోని భావన.
చలం రచనా శైలి మీద కవి సతీష్చందర్ మాట్లాడుతూ” చలంది విచిత్రమైన శైలి,ఉ ఉడికించే శైలి, కవ్వింపు శైలి, చదివేవాణ్ణి తిట్టడం,అభిమానుల్ని విమర్శించడం చలం రచనల్లో కనబడుతుంది. జీవితాభిరుచిలేని వాళ్ళని నిలదీస్తూ, షాక్ ఇస్తూ చెప్తాడు. చలం శైలిలో వెక్కిరింత పాలు కూడా ఎక్కువే. పవిత్రద్వేషం పవిత్ర పగ ఉన్నవాళ్ళే చలంలా రచనలు చేయగలరు. చలం ఒక విచిత్రమైన విధానాన్ని రచనలో పాటించాడు. సమాజంలో వికృతి ప్రకృతిని తయారుచేయడం ఆయన శైలిలోని ప్రధాన లక్షణం. ” అని సతీష్ చందర్ ముగించారు.
ఈ సమావేశానికి ప్రత్యేక ఆహ్వానితులు మాభూమి సంధ్య, విమల, సుద్దాల భారతి తమ పాటలతోని చలానికి నివాళులు అర్పించారు.
అభిప్రాయాలు లేవు »సాహితీ సదస్సులు – రిపోర్టులు