Aug2009
విప్లవకవి శ్రీశ్రీ శతజయంతి సభ
విరసం సిటీ యూనిట్ జూలై 3న శ్రీ శ్రీ శతజయంతి సభ నిర్వహించింది. ఈ సభకు అధ్యక్షురాలిగా డా.గీతాంజలి వక్తలుగా వేణు సంకోజీ, వరవరరావు, ఎన్.వేణు గోపాల్ వచ్చి ప్రసంగించారు.
వేణు సంకోజీ శ్రీశ్రీ ని గురించి తన అభిప్రాయాల్ని చెబుతూ నిరంతర సమకాలికుడు శ్రీశ్రీ అని, నిర్దిష్టమార్గాన్ని ఎంచుకుని కాలాన్ని తన భుజం మీద ఎత్తుకుని నడిపిస్తూ అద్భుత కవిత్వ సృష్టి చేసాడు. అందుకే ధైర్యంగా “నేనొక దుర్గం, నాదొక స్వర్గం, నామార్గం అనితర సాధ్యం” అని అనగలిగాడు. తన కిష్టమైన శైలి తనదే అని గట్టిగా చెప్పుకున్న సాధికారికత కలిగినవాడు. శ్రీశ్రీ కి సాహిత్యాన్నీ సర్వస్వం చేసుకుని తన ఎజెండా మానవుడు అని ప్రకటించాడు. శ్రామికుల పక్షాన ప్రతిఙ్ఞ చేసిన మొట్ట మొదటి కవి శ్రీ శ్రీ అని చెప్పవచ్చును.
ఎన్. వేణు గోపాల్ ప్రసంగిస్తూ 1938-1983 వరకు కాలం విధించిన అన్ని బాధ్యతల్ని సమర్ధవంతంగా మోసిన కవి శ్రీశ్రీ ప్రవాహ స్వభావం కలిగిన కవి, లోతైన సాహిత్య సృజన చేసిన గొప్పకవి. చరిత్ర తన నుంచి కోరుకున్నదానికి నిర్వర్తించే బాధ్యతగా కవిత్వం రాసాడు. విరసం ఏర్పాటు, విప్లవకవిత్వం పుట్టుక రావడంతో శ్రీశ్రీ మహాప్రస్థానం ప్రతిఫలనం ఉన్నది. గున్నార్ అన్నట్టు “శ్రీశ్రీ ప్రపంచకవి”. తన కవిత్వం ద్వారా గొప్ప గుర్తింపును పొందాడు. చివరిదాకా విరసంతో కొనసాగాడు. అందుకే శ్రీశ్రీ ఎప్పటికి విరసం కవే అని ముగించారు.
వరవరరావు శ్రీశ్రీ గురించి చెపుతూ “శాంతియుత సహజీవన వాదాన్ని చెప్పిన కృశ్చేవ్ యొక్క అభిప్రాయాలకు తెలుగు సాహిత్యంలో పరిపూర్ణమైన అంగీకారం లేదని కవులు తమ కవిత్వం ద్వారా చెప్పారు. అటువంటి సమయంలో శ్రీశ్రీ ఖడ్గ సృష్టి రచన చేస్తున్నాడు. శ్రీశ్రీ, గురజాడ, గిడుగు తదితరులు ఆదివాసీ గ్రామ మూలాల్లోంచి వచ్చిన వారు కావడం చేత గొప్ప రచయితలైనారు. ఆందుకే ప్రపంచంలో ఎక్కడ సామాన్య ప్రజలకు ఇబ్బందులు ఎదురైన తన కవిత్వం ద్వారా సమాధానం చెప్పిన కవి శ్రీశ్రీ. రాజకీయాలు సాహిత్యం మాట్లాడకూడదనే మధ్య తరగతి వాదనను తిరస్కరించిన వాడు. తిక్కన లాంటి వాళ్ళు కూడా రాజకీయంలో పాల్గొన్నవాళ్ళే ఆకాలంలో. అందుకే దిగంబరకవుల్ని మొట్ట మొదటి స్వాగతించినాడు” అని తన ప్రసంగాన్ని ముగించారు.
అభిప్రాయాలు లేవు »సాహితీ సదస్సులు – రిపోర్టులు