Oct2009
ఆర్.వసుంధరా దేవి కథలు – సమగ్రజీవన సూచికలు
మనిషి పుట్టిన తరువాత జీవించడం అనివార్యం. పేదస్థితిలో నైనా, సంపన్నులైనా జీవించే విధానంలో దుర్భరస్థితిలోనైనా, దరిద్రులైనా దర్జాగా కాకున్నా జీవించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా జీవితమ్మీద ఇష్టం లేక కొందరు జీవితమే సరిగ్గా లేదని కొందరూ ఇవాళ జీవితాలను అంతం చేసుకుంటూఉన్నారు. సహజంగా మరణము వచ్చేంత వరకూ మరణాన్ని మన చేతుల్లోకి తీసుకోకపోవడమే జీవన సూత్రం. ఇలాంటి జీవనస్థితి గతులను సాహిత్యం ప్రతిబింబించాలి. అలాంటి సాహిత్యం సమాజగతం కావాలి. అదే జీవనానికి అవసరమైన దిశా నిర్దేశం చెయ్యాలి.కేవలం సమాజం యొక్క స్థితిగతులను ప్రతిబింబించడానికీ సాహిత్యం పరిమితం కాకూడదు.జీవనానికి అవసరమైన గమన సూత్రాలను కూడా ప్రతిపాదించాలి.
శ్రీశ్రీ, చలం, కొడవటిగంటి, రావిశాస్త్రి, శ్రీపాద, ఇలా చెప్పుకుంటూపోతే ఎంతోమంది సాహిత్యంతో ఆనాడు జీవన స్థితిగతుల్ని నిర్దేశించారు, నిర్ధారించారు, నిర్వచించారు. ఉన్నతీకరించారు, విపులీకరించారు. మనిషి ఏ స్థలకాల ప్రభావాలలో ఎలా ప్రభావితమౌతారో ఎలా ఆటుపోట్లను తట్టుకుంటారో, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా జీవితం విలువైనది ఉన్నతమైనది. అది ఏదో ఒక రూపంలో మనకూ సమాజానికీ ఉపయోగపడాలన్న చలనసూత్రాలను మనకు అందించారు.
ఈ కోవకు చెందినవారే ఆర్ వసుంధరాదేవి గారు. ఈమె రాసిన కధలన్నీ ఒక చోట చేర్చి సంకలనంగా తేవడంతో జీవితాన్నంతా ఒక చోటే కుప్పబోసిన అనుభూతి కలుగుతుంది. బతుక్కు ప్రయోజనం జీవితపు లోతుల్ని తరచి చూడడం అనేది కథాప్రయోజనమైతే ఆ ప్రయోజనం మనకు ప్రతి కథలోనూ కనిపిస్తుంది.జీవన సారమేమిటో, వైవిధ్య భరితమైన జీవితంలో జీవన సాఫల్యం ఎలా సాధించుకోవాలో అణువణువునా చిత్రీకరించింది. పుట్టుకకు మూలము, జీవికకు సారమూ, మరణానికి కారణమూ, మరణించడానికి సంతోషపూర్వకమైన సంసిద్ధత ఇవన్నీ కథల నిండా కదలాడుతూనే ఉంటాయి.
ముస్లింలేంది,హిందువులేంది, వెనకబడిన కులాలేంది మతాలేంది చుట్టూ ఉండే మనుషులందరూ ఒకటే కదా. అందరూ చుట్టాలుగానే చూడ్డంలోనే ఉంది మనిషి పుట్టుకకు సార్థకత అనిపిస్తారు ఒకపాత్రలో భగవంతుడు మనిషిని మట్టితో చేశాడు. అందుకే రోజూ నీళ్ళు పోసుకున్నామట్టే వస్తది. ఆఖరికి బొమ్మ మట్టిలోనే కలిసిపోతుంది. ఈ నడుమ మనిషికెందుకీ ఆరాటం గాలిరధం కథలో జీవన సత్యాన్ని కళ్ళకు కడతారు.
ఇవాళ ప్రయోగాత్మక కథలెన్నో వస్తున్నాయి. అయితే ఆనాడే ఆమె ప్రయోగాత్మక పద్ధతిలో కథ మొదలెట్టడం ఎలాగో బదిలీ కథలో చూయించింది. నాకు ప్రపంచం లేదు. బదిలీ అయిపోయింది. నాలోకి బదిలీ అయిపోయింది. ఇప్పుడు నేనే ప్రపంచాన్ని .ఎన్ని ప్రయోగాలు చేసినా కథకు ప్రయోజనం చేకూరాలి. పాఠకుడు కథలోకి ప్రవేశించి చదవగలగాలి. అప్పుడు కథా ఆ కథలో ఏముందో తెలుసుకునేది. ప్రయోగం కోసం కాకుండా ప్రయోజనం కోసం చేసినప్పుడు కథయొక్క ప్రయోజనం పాఠకుడికి అందుతుంది.
ఈమె ప్రయోగాల్లో ఎక్కడా అస్పష్టత కానీ సంక్లిష్టత కానీ కనిపించదు. మహాప్రదో మహాగర్తో కథలో ముసలామె కంఠస్వరంతో మాట్లాడుతుంది. మనిషి అస్తిత్వానికి అర్థం చెప్పగలిగేది డబ్బేనా అంటూ నేటి కాలానికి వర్తించే ప్రశ్న ఆనాడే వేయించారామె.నిజానికి ఈ ప్రశ్నకు ఎప్పుడైనా సమకాలీనత ఉంటుందేమో! ఈ కథలో రెండుతరాలను చిత్రిస్తూ ఈ రెండు తరాలకే కాకుండా ఏ రెండు తరాలకు మధ్యనైనా ఉండే అంతరాలను కథలో గుచ్చినట్టు చెప్పారు. ఆ ఉత్తరం ఇంకా చదవలేదు కథ లో మన ప్రవర్తనని బట్టే ఎదుటి వాళ్ళ ప్రవర్తన ఉంటుందని చాలా చిన్న కథైనా చాలా బలంగా చెప్పగలిగారు.
మనుషులూ బొద్దింకలూ కథలో బొద్దింకతో పోలుస్తూ మనిషి స్వభావాన్ని చెప్పారు. మనుషుల్లో స్పందనలు, ఆశలు, కోరికలు ఎలా ఉంటాయో, ఎలా ఉండాలో స్పందనలు లేని మనిషి ఎంత నిర్వీర్యమైపోతాడో తెలియజెప్పారు. చెప్పే హితబోధలకూ పాటించే విలువలకూ, చేసే పనులకూ పొంతనలేని ఎంతో మంది ఈ నాటి రచయితలు చదివినేర్చుకోదగిన, జీవితానికి కావలిసిన ఆశాదృక్పధము కలిగిన కథలెన్నో ఈ సంకలనంలో ఉన్నాయి.
నాగరిక సమాజం , ధనాశ, డాబూ దర్పం మనిషిని ఎంత హింసాత్మకంగా మారుస్తాయో పిచ్చి కథ చదివితే తెలుస్తుంది. ఫ్రాయిడ్ , అడ్లర్ లను కూడా కథల్లోకి తీసుకు వచ్చి మనుషుల మానసిక పరిస్థితిని విశ్లేషించారంటే రచయితకు జీవితానుభవంతోపాటుగా అధ్యయనం ఎంత అవసరమో తెలుస్తుంది. గొప్ప ఉద్రేకంతో సాగుతున్నా స్త్రీవాద దళితవాద దృక్పదాలను ఆనాడే తన కథల్లో ఎంతో సంయమనంతో చర్చించారు.
వెలుపలి వాతావరణం చిత్రించడంతోనే కథ అయిపోయిందనుకునే నేటితరం ముందు తరాన్నుండి వారసత్వంగా అందుకోవాల్సిన అంతర్గత వాతావరణం అందుకోలేదేమో ! మనిషి నిర్వేదంగా మారడానికి, నిర్దయంగా ఆలోచించడానికి అంతరంగ చలనం ముఖ్యం కదా! అలాంటి ఆలోచనలు , ఘర్షణలు మనసులు మూగబోవడాలు, హృదయాలు మూలమూలల్లో స్పందనలకు గురి కావడాలూ అంటే ఎలా ఉంటుందో ఈ కథల్లో చూస్తాం.
భౌతికంగా ఎన్నో సుఖసౌఖ్యాలుండవచ్చు. వాటిలో కొన్ని లోకం కోసం , మరికొన్ని మనకోసం. ఒక్కొక్కసారి మనసు సుతిమెత్తగా ఆర్థ్రంగా, హృదయాంతర్గతమైన ప్రేమనూ అభిమానాన్ని మానవీయతనూ కోరుకున్నపుడు ఇవన్నీ ఉత్త చెత్తలాగా కనపడవచ్చు. లోకంలో పెళ్ళిళ్ళు పిల్లలూ ఆస్తులూ అంతస్తులూ అన్నీ ఉన్నా మనసు లోతుల్లో అనుభూతుల్లో ఆలోచనల్లో పంచుకునే తోడులేనప్పుడు ఐహికమైన ఈ ప్రపంచంలో తనకంటూ ఏముందనిపిస్తుంది. చీకటి కథలో ఈ విధమైన ఆలోచనాపరంపర సాగుతుంది. కథ చివరకు చీకటి విడిపోయి వెలుతురు రేఖలు మన కళ్ళ ముందు పొడసూపుతాయి.
కథల్లో ఎన్ని ప్రయోగాలు చెయ్యచ్చో అన్ని ప్రయోగాలూ ఈమె కథల్లో చేసి చూయించారు. దుర్భేద్యమైన కోటను తన చూట్టూ కట్టుకున్న శివరావు ఎవరినీ తన కోటలోకి రానీయకుండా మనుషులతో ఎలాంటి సంబంధాలు లేకుండా ఉంటే చివరకు ఎలాంటి కుక్కచావు చావాల్సి వస్తుందో ప్రతీకాత్మకంగా చూయించారు.
బూతులు, తిట్లు , శాపనార్థాలు, అసహనాలు, ఆగ్రహాలు ఎన్నింటినో తమ సాహిత్యం లో పెద్దపీట వేస్తున్న రచయితలు అసలే తిరోగమనంలో ఉన్న పాఠకుల్ని ఇంకా బెంబేలెత్తించే పనిలోఉన్న కవులు చదివి రాయడాని కంటే ముందు ఎంత ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని అలవరుచుకోవాలో ఈ కథలు చదివితే తెలుస్తుంది. మనిషి మనిషి కీ మధ్యన ఉండాల్సిన ప్రేమ వంతెన తెగిపోతుంది. ఆ వంతెన నిర్మించుకోవడమెలాగో ఈ కథలు చదివితే తెలుస్తుంది. బాల్యంలోకి వెళ్ళి బాల్య ఙ్ఞాపకాలనూ, యవ్వనంలోకొచ్చి యవ్వనోద్రేకాలనూ, వృద్ధాప్యంలోకొచ్చి జీవన తాత్వికతనూ ప్రోదిచేసుకుని ప్రతిక్షణమూ సజీవంగా జీవించి జీవన విలువలను సహజాతాలను , సహనశీలతను, సద్వివేచనను ఆలోచనా దృక్పధాన్ని ప్రోదిచేసుకుని మనిషిని మనిషిగా బతకండని నిలదీసి చూపే కథలివి.
సుఖదుఃఖాలూ కష్టసుఖాలూ, వెలుగూ చీకటీ అన్ని జీవులలో సహజమే . కష్టాలొచ్చినప్పుడూ కుంగిపోవడం, సుఖాలొచ్చినప్పుడు పొంగిపోవడం ఇవి రెండూ జీవితానికి అనవసరమైన విషయాలే. నిజం చెప్పాలంటే కష్టాలొచ్చినప్పుడే కదా సంతోషంగా ఉండడానికి ప్రయత్నించాల్సింది హసీనా కథల్లో హసీనాని ప్రతీకాత్మకంగా మన కళ్ళ ముందుంచుతారు. ఈ కథ చదివితే లోపలి పొరలు విచ్చుకుని మనసు మూలల్లో ఉన్న చీకటిపారిపోయి వెలుతురు రేఖలు విచ్చుకుంటాయి.
పరిస్థితులు వచ్చి ఒక మనిషిని హత్య చేస్తే శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. ఏ పరిస్థితిలోనైనా మనిషిని నిర్మూలించాలనే ఆలోచన రావడం సబబేనా అలాంటప్పుడు న్యాయస్థానంలో ఎలాంటి తీర్పు చెప్పాలో న్యాయం కథలో తన వైఖరిని స్పష్టంగా చెబుతారు.
ఈ కథలు చదువుతుంటే జీవితానికి కావలిసిన తాత్వికత అన్ని కోణాల్లోనూ కనిపిస్తుంది. ప్రతి రోజూ మనకు తారసపడే ఎన్నో రకాల పాత్రలు ఈ కథల్నిండా జీవంపోసుకుని మన కళ్ళ ముందుకు వస్తాయి. పుట్టుకనుండి మరణం వరకు ఏయే దశలున్నాయో ఆయా దశల్లో మనమెలాగా ప్రవర్తిస్తామో అన్ని ప్రవర్తనలూ ఉన్నాయీ ఎన్నో కథలకు తానే తీర్పరిగా కూడా మారతారు . మనుషులతో పని లేకుండా కేవలం స్వార్థంతో జీవించాలనుకునే మనిషి చివరికి ఏ గతి పడుతుందో పేదల ఆశలు కథలో చిత్రీకరిస్తారు. ఈ కథలో మానవ సంబంధాలు మనిషికి ఎంత అవసరమో అర్థమవుతుంది.
ఒక మనిషిని ఉన్నతుడుగా చెయ్యడములోనూ, కార్యరంగంలోకి దూకడానికి అవసరమైన శక్తిని ప్రసాదించడములోనూ, ఏ పరిస్థితుల్లోనైనా మనిషి బతకడానికి అవసమైన సరంజామాను అందించడములోనూ మనిషి ఉన్నతంగా బతకడానికి అవసరమైన జీవన సూత్రాల్ని అందిచండంలోనూ ఈ కథలు ఈ తరం కెరియరు కు, communication skills అన్నింటికీ ఉపయుక్తమైన కథలు.
స్థానిక భాషల్లోనూ కథల్ని ఆనాడే రాసిన ఈమె జీవితం కంటే పెద్ద ప్రయోగశాల ఎక్కడ ఉంది అంటారు. ఈనాడు ప్రయోగాలపేరుతో స్థానీయత పేరుతో ఎంతో సంక్లిష్టంగా వస్తున్న కథలు రాసే కథకులు ఈ కథల్ని చదివితే చాలా తెలుసుకుంటారు. ఎదగని పాఠకుల కోసం వృధా ప్రయోగాలెందుకు అనికూడా అనిపిస్తుంది. ప్రతి కథా మొదలుపెట్టిన ప్రతీసారీ ఏదొక గొప్ప అనుభవాన్ని కళ్ళ ముందుంచి అనుభూతికి లోను చేస్తారామె.ప్రతి కథా మొదటి నుండీ చివరి వరకూ ఒక దృశ్యాన్ని అలా కళ్ళ ముందుకు తెచ్చినిలుపుతుంది.
రచన ప్రయోజనం ఆలోచనాపరులైన సహృదయ పాఠకుల ముందుకు వచ్చి వారి ఙ్ఞాపకాల్లో నిలవడం. అందుకే నాకథల్ని పుస్తకరూపంలోకి తెచ్చి మీ ముందుంచుతున్నాను అని సవినయంగా చెప్పిన వసుంధరాదేవి కథలు ఆనాడు భారతి మాసపత్రిక, ఆంధ్రపత్రిక సంవత్సరాది సంచికల్లో,ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికలో, యువ మాసపత్రికలో, సృజన సాహిత్యపత్రికలోనూ ప్రచురించబడినాయంటే వీటి ప్రాశస్య్తం ఎలాంటిదో అర్థం చేసుకోవొచ్చు. ఈ కథలు వివిధ భాషల్లోకి కూడా అనువాదమై అనేక అవార్డులు పొందాయి.
అభిప్రాయాలు లేవు »పుస్తక సమీక్షలు