Oct2009
విమర్శకునితో ఒక సాయంత్రం
ప్రముఖ సాహిత్య విమర్శకులు ఆచార్య కె.కె.రంగనాధాచార్య గారితో కేంద్ర సాహిత్య అకాదమి వారు “విమర్శకునితో ఒక సాయంత్రం” అనే కార్య క్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కార్యదర్శి ఇళంగోవన్ అధ్యక్షత వహించారు.
కె.కె.రంగానాధాచార్య తన గురించి మాట్లాడూతూ సాంప్రదాయ కుటుంబంలో జన్మించిన తను ఆధునిక భావజాలం వైపు ఎలా మళ్ళినది తెలియజేయాలని ఈ కార్యక్రమానికి వచ్చాను. సీతారంబాగులో ఆచార్యుల కుటుంబం మాది. తమ కుటుంబ పెద్దలు ఆచార్య పురుషునిగా చేసే ఉద్దేశ్యంతో సాహిత్యం వైపు కన్నెత్తి చూడనీయలేదు. తెలుగు నిషేధించబడిన ఇల్లు కావడం వలన పత్రికలు చదవడానికి కష్టమయ్యేది. వచ్చిన సంభావనతో దొంగచాటుగా చలం, శరత్, ప్రేమచంద్ లాంటి వారి రచనలు చదివేది. అలంకార శాస్త్రాలన్నీ కంఠతా వచ్చేవి. తను ఎక్కడా వివక్షతలకు లోను కాలేదు. వ్యక్తి కేంద్రీకృత కుటుంబం నుంచి రావడం మూలానా కొన్ని కట్టుబాట్లని చేదించవలసి వచ్చింది.
భావాల విషయంలో ,ఆలోచన విషయంలో నా తోవను నేనే వెతుక్కున్నాను. తప్ప మార్గదర్శకులు ఎవరూలేరు. జీవిత సంఘర్షణ నుంచి రాకున్నా ఒక అవగాహన నుంచి సాహిత్య విమర్శలోకి వచ్చినవాణ్ణి. తన జీవితంలో గొప్ప మలుపు ఆంధ్రసారస్వత పరిషత్ లెక్చరర్ గా చేరడం. హైదరాబాద్ తెలుగు సాహిత్యంలో పరిషత్ చేసిన సేవ ఎనలేనిది. అప్పటి సాహిత్యంతో నేటి సాహిత్యాన్ని పోలిస్తే నిజమైన ప్రజాస్వామ్యం లోపించిందేమో అనిపిస్తుంది. అందుకే “ఆధునికత మరో చూపు” అనే పుస్తకాన్ని రాస్తున్నాను.
తన సాహిత్య ప్రస్థానం గురించి చెప్పాలంటే , తను ముఖ్యంగా ద్రవిడ భాషలు, ఉత్తర భారత భాషల మీద కొంత అధ్యయనం చేయడం జరిగింది. తను పరిశీలించినంతవరకు తమిళ సాహిత్యం లౌకిక ఆదర్శాలతో వచ్చింది. తెలుగు సాహిత్యం ప్రారంభమైన తీరు వేరు. ఉత్తరాది సాహిత్యంలో భక్తి సాహిత్యం ప్రదాన స్రవంతి, కాని తెలుగులొ వైరుద్యమున్నది. ఇక్కడ రెండు ధోరణులున్నాయి ఆ కాలంలో మార్గ- దేశీ కవిత్వాలు సమాంతరంగా వచ్చినవి. తెలుగులో తొలి సమాజకవులు అన్న పుస్తకాన్ని ప్రచురించాను.
ప్రస్తుత సాహిత్యానికోస్తే సమకాలీన రచనల్ని పరిశీలించడం జరుగుతుంది, కాని అంచనాలు వేయడానికి సమయం పడుతుంది. రోజురోజుకు సిద్ధాంతాలు మారిపోతున్నాయి. భక్తి మార్గం ఎంత పెరుగుతుందో, అంతే స్థాయిలో తిరుగుబాటు కవిత్వం పెరుగుతుంది. చివరగా తెలుగు ప్రజలు శరత్ ను అధికంగా ఇష్టపడడానికి మధ్యతరగతిని గురించి రాయడం, ప్రేమ్ చంద్ దిగువ మధ్య తరగతిని గురించి రాయడమే కారణం అని ముగించారు. అనంతరం జరిగిన చర్చలో అంపశయ్య నవీన్ , వాసిరెడ్డి నవీన్, కె.పి.అశోక్ కుమార్ తదితరులు పాలోన్నారు.
అభిప్రాయాలు లేవు »సాహితీ సదస్సులు – రిపోర్టులు