Jan2010
ఇప్పుడు నువ్వన్నదే సై
అమ్మ తెలంగాణా
కన్నీళ్ళ తులాభారమే పతిదినం నీకు
ఎక్కడ తప్పిపోయానే నేను
నెలపొడుపు చూసినపుడు నన్ను పిలిచినవ
కండ్లు తెరిసి నా ముఖమె సూసి
నన్నెత్తుకుని ముద్దుపెట్టుకున్నవ
ఎందుకు మరిసినవె అమ్మా
ఇపుడు నెలపొడుపే సూడబుద్ధైతలెదు
గోడల కాడున్నపుడె బాగుండె
సదుకుని సెడిపోయిన
పొలం బాయె గొడ్లువాయె, ఇల్లువాయె
కొలువులు గుంటూరి గుడిసెల పాలయె
ఉన్న మడిసెక్క సెజ్జుల గలసిపాయె
ఆశ పెట్టి పొయెటోల్లె గాని
బేత తొక్కొనోల్లు లేరు
కాటగలిసిపోయినట్ల బుగులైతందే
ఎపుడు తెల్లారుతదొ
అమ్మ, నాకింత కారంబువ్వ వెట్టు
గొడ్డలిపురానమె మొదలయ్యెటట్టుంది
నాతోని ముచ్చటజెప్పు జప్పున
నువ్వేదంటే గదే నీ మాటే సై
veeragoni Jan 6, 2010 1
కొలువులు గుంటురు గుదిసెల పాలు అనె పద ప్రయొగము బాగా లెదని నా భావన.గుడిసెలు ఎవరివి అయిన మనవె నని గద ?
ramireddy Jan 7, 2010 2
ప్రజలను రెచ్చగొట్టే శుష్క నినాదాలు వద్దని సంపాదకులకు ముఖ్యంగా సాహిత్య సంపాదకులకు మనవి. కేవలం రాజకీయాలే కాకుండా అప్పుడప్పుడూ సాహిత్య స్పర్శ చేస్తుండండి. (ఇరుప్రాంతాల ప్రజలకు / సాహిత్య కారులకు)
pravallika Jan 7, 2010 3
ప్రజలగురించి రాసేది కవిత్వం కాదా,ఏ ప్రజలు రెచిపొతున్నరాంరెడ్డి గారు చెప్పలి, కవిత్వం లో రాజకీయాలయాఉందవా, ప్రాంతీయ భావనతోని కవిత్వం రాయవద్ద
haragopal Jan 7, 2010 4
గుడిసెలు అవే.గరిశెలు ఎవరివి నిండినయి.దమ్ముంటే మా ఊర్లెకు రాండ్రి.లెక్కలు చూపిస్తం.
కొలువులు ఎవరికి దక్కినయొ.
హరగోపాల్
haragopal Jan 8, 2010 5
మా దగ్గిర గుంటూరోల్లంటే ఆంద్రోల్లని అర్థమ్
Ari Sitaramayya Jan 9, 2010 6
తెలంగాణాలో ఏ అర్థముందో తెలియదుగాని ప్రకాశం జిల్లాలో దమ్ముంటే మావూరికి రాండి అంటే ధైర్యముంటే మావూరికి రాండి అని అర్థం. అంటే నా అభిప్రాయంతో ఏకీభవించేవారికి ఎలాంటి భయం అవసరం లేదు, కాని విభేదించేవారికి మాత్రం భద్రత లేదు, ఇక నీ ఇష్టం, రాదలిస్తే రా అనటం అన్నమాట.
తెలంగాణా రాష్ట్రం ఏర్పడాలిని అనుకుంటున్న వాళ్ళలో నేనూ ఒకడిని. కాని నేను ఆశిస్తున్న తెలంగాణా ప్రజాస్వామిక తెలంగాణా. ఫాసిస్ట్ తెలంగాణా కాదు. దురదృష్ట వశాత్తూ ప్రస్తుత తెలంగాణా నేతల్లో ముందున్నవాళ్ళలో చాలా మంది ఫాసిస్ట్ భాష వాడుతున్నారు. మాతో విభేదించేవారిని తరిమేస్తాం, నాలికలు కోసేస్తాం (చంద్రశేఖర్ రావు), హైదరబాదులో విమానాలు దిగనివ్వం (హరీష్ రావు), పండగకు ఇంటికెళ్ళినవారిని తిరిగిరానివ్వం (జె ఏ సి వనేతలు), వాళ్ళను ఇళ్ళు కట్టుకోనిచ్చాం, బతకనిచ్చాం (రాం రెడ్డి దామోదర్ రెడ్డి) ఇలాంటి చెత్తా చెదారం నాయకులు అనవలసిన మాటలు కాదు. దమ్ముంటే మా వూరు రాండి అనటం కూడా ఈ కోవకు చెందిన భాషే. ఇలాంటి వారి వల్ల తెలంగాణా ప్రజలకు నష్టమే గాని ఎలాంటి మంచీ జరగదు.
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక కూడా దేశంలో ఏప్రాంతం వారైనా తెలంగాణాలో నివాసం ఏర్పరుచుకోవచ్చు. పొలాలు కొనుక్కోవచ్చు, ఉద్యోగాలు చేసుకోవచ్చు. దానికి ఎవరి అనుమతీ అవసరం ఉండదు. తెలంగాణా ప్రజలకు అందిరితో పోటీపడగల సత్తా రావాలని, దానికి కావాల్సిన వనరులు ఏర్పడాలని ఆశించాలేగాని, శివ సేన లాగా మా ప్రాంతంలో ఉండాలంటే మీరు మాతో విభేదించటానికి వీల్లేదనే పరిస్థితి రాకూడదు.
Tirunagari Satyanarayana Jan 13, 2010 7
ఆరి సీతారామయ్య గారితో దాదాపుగా ఏకేభవిస్తున్నాను. తెలంగాణ ఉద్యమం లో వినబడుతున్న కొన్ని వ్యాఖ్యలు తెలంగాణ ను సమర్థిస్తున్న తెలంగాణేతర ప్రజాసామికవాదులని దూరం చేసేటట్టున్నయి. సమైక్యాంధ్ర నినాదంలోని డొల్ల తనాన్ని, బూటకత్వాన్ని గుర్తెరిగినా, తెలంగాణవాదుల నుండి అక్కడక్కడ వినబడే కొన్ని దురుసైన వ్యాఖ్యల వల్ల ప్రజాస్వామికవాదులనేకమంది బాహాటంగా తెలంగాణ ఉద్యమానికి మద్దతునివడానికి తటపటాయిస్తున్నారు. అనుమానిస్తున్నారు. తెలంగాణ ఉద్యమాన్ని ఒక ప్రజాస్వామిక ఆకాంక్ష కోసం జరిగే ‘ప్రధాన స్రవంతి’ ఉద్యమం గానే చూడాలి. ‘మన ‘ప్రధాన స్రవంతి’ ఉద్యమమన్నప్పుడు దానిలో అనేక అభిప్రాయాలు, భిన్నాభిప్రాయాలు, (అప్రజాస్వామిక శక్తులు కూడా) ఉంటాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడడం అనే ఆకాంక్ష ప్రజాస్వామికమైనంత మాత్రాన దానికొరకు జరిగే ఉద్యమం అన్ని సమయాల్లోనూ, సందర్భాల్లోనూ ప్రజాస్వామికంగా ఉండకపోవచ్చు. రేపు తెలంగాణ ఏర్పడ్డాక అది సంపూర్ణ ప్రజాస్వామిక రాష్ట్రంగా విరాజిల్లుతుంది అనుకోవడం కూడా సరైంది కాదేమో. ప్రజాస్వామిక తెలంగాణ కోసం పోరాడ్డం ఇవాళ్ళా, రేపు తెలంగాణ ఏర్పడ్డాక కూడా ప్రజాస్వామిక వాదులు చేస్తూనే ఉండాలి. ఈ పని తెలంగాణేతర ప్రజాస్వామిక వాదులు కూడా చెయ్యాలి. అప్పుడే ఉద్యమం సంపద్వంతమవుతుంది. నిజమైన ప్రజాస్వామిక ఆకాంక్షగా ఫలిస్తుంది.
అయితే దాదాపు అన్ని అస్తిత్వ ఉద్యమాల్లోనూ కొన్ని సార్లు అనేక తీవ్ర స్వరాలు (ఓవర్ టోన్స్ ) వినబడతాయి. స్త్రీ ఉద్యమం ముందుకొచ్చిన తొలిరోజుల్లో పురుషులమీద తీవ్ర స్వరంతో అనేక వ్యాఖ్యలొచ్చాయి. అవి పురుషుల్లోని ప్రజాస్వామికవాదులని కలవరపరిచాయి. అట్లే దళిత ఉద్యమం ముందుకొచ్చినప్పుడు అగ్రకులాల వారిమీద తీవ్ర విమర్శలే వచ్చాయి. అవి అగ్రకులాల్లోని ప్రజాస్వామిక వాదులని బాధించాయి. ఇట్లాంటి తీవ్ర స్వరాలు అస్తిత్వ ఉద్యమాల ప్రత్యేకత గా చూడాలి అని నేననుకుంటున్నా! అట్లే తెలంగాణ ఉద్యమంలో కూడా కొన్ని తీవ్రస్వరాలు వినబడవచ్చు. ఉద్యమం తీవ్రంగా ఉన్నప్పుడు కొన్ని అప్రజాస్వామిక ధోరణులు కనబడవచ్చు. అయితే వాటిని కాలక్రమేణా ఆ ఉద్యమంలోని ప్రజాస్వామిక శక్తులే సరిదిద్దుతాయి. సరిదిద్దాలి కూడా! బయటనుండి ఉద్యమానికి మద్దతునిచ్చే ప్రజాస్వామిక వాదులు కూడా అట్లాంటి అప్రజాస్వామిక ధోరణులని ఫాసిస్టు ధోరణులని తీవ్ర నింద వేయకుందా వాటిని సరిదిద్దే ప్రయత్నం చేయాలి. సరిదిద్దే క్రమాన్ని ముమ్మరం చేస్తూ ఒక ముఖ్య పాత్ర వహించాలి.
Ari Sitaramayya Jan 15, 2010 8
శ్రీ సత్యనారాయణ గారు అన్నట్లు తెలంగాణ ఉద్యమం ప్రధాన స్రవంతి ఉద్యమం అయితే, ఫాసిస్ట్ పదజాలం కొద్ది మంది నోటి నుంచి మాత్రమే వస్తుంటే విచారించాల్సిన అవసరం లేదు. ఉద్యమమన్నప్పుడు దానిలో అనేక అభిప్రాయాలు, భిన్నాభిప్రాయాలు, అప్రజాస్వామిక శక్తులు కూడా ఉంటాయి అన్నారు శ్రీ సత్యనారాయణ గారు. ఉండాలి. అలా ఉన్నప్పుడే అది ప్రజాస్వామిక ఉద్యమం అనే నమ్మకం కలుగుతుంది. ప్రస్తుతం అలా లేదు. కొంచెం కూడా లేదు. రెండు రోజుల క్రితమే ఈ సినిమాను ఆడనివ్వం అని ఉద్యమ నేత ఒకామె అన్నారు. తర్వాత ఆడనిస్తాం అని ఆ పార్టీ నిర్ణయించింది. ఆడ నివ్వటం ఆడనివ్వకపోవటం గూండాలు మాత్రమే చెయ్యగల పని. ఉద్యమం వీళ్ళ చేతుల్లోకి ఎలా వెళ్ళింది? అసలది నిజమైన ఉద్యమమే అనటానికి ఆధారాలేమిటి? ప్రస్తుత నేతల్లో ప్రజస్వామికంగా మాట్లాడుతున్న నేతలెవరు?
నేను ప్రత్యేక రాష్ట్రాన్ని సమర్థిస్తున్నా సమైక్య రాష్ట్ర ఉద్యమం బూటకం అని నేను అనుకోవటం లేదు. నిజానికి తెలంగాణా ఉద్యమం కంటే సమైక్య రాష్ట్ర ఉద్యమమే ప్రజాస్వామికమైందని అనిపిస్తుంది. ఆంధ్ర సీమ ప్రాంతాల్లో ప్రత్యేక ఆంధ్ర కావాలని ఉద్యమిస్తున్న వారుకూడా ఉన్నారు. సమైక్య వాదులను చూసి వారు భయపడటం లేదు. తమ అభిప్రాయాలను బాహాటంగానే వ్యక్త పరుస్తున్నారు. కాని తెలంగాణా ప్రాతంలో భిన్నాభిప్రాయాలకు చోటులేదు. తెలంగాణా వారందరూ ప్రత్యేక రాష్ట్రం కోరుకుంటున్నారనుకుందాం. కాని హైదరాబాదు రాష్ట్రరాజధాని కావటం వల్ల గత యాభై యేళ్ళలో లక్షలమంది ఆంధ్ర సీమ ప్రజలు హైదరాబాదొచ్చారు. వారికి రాష్ట్రం సమైక్యంగా ఉండాలనే అభిప్రాయం ఉండటం సహజం. కాని ఆ అభిప్రాయం వ్యక్తం చెయ్యటానికి భయపడుతున్నారు. నిజానికి వారు ఇప్పుడు ప్రాణభయంతో ఉన్నారని అందరికీ తెలిసిన విషయమే. ప్రత్యేక తెలంగాణా ఉద్యమం నిజానికి ప్రజా ఉద్యమం అయిఉంటే, ప్రజాస్వామిక ఉద్యమం అయిఉంటే, భిన్నాభిప్రాయాలు వ్యక్తం చెయ్యటానికి ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. నేను ఆశించే తెలంగాణా ఇది కాదు.
ఫాసిస్ట్ లు ముఖ్యనాయకులుగా ఉన్నంత కాలం ప్రత్యేక తెలంగాణా రావటం అంటే తెలంగాణా ప్రజలను గూండాల చేతులకి అందించినట్లే అవుతుంది. పరిస్థితి మారాలంటే ఉద్యమం ప్రజాస్వామిక ఉద్యమంగా మారాలి. అలా మారిందాలేదా అనటానికి గుర్తు భిన్నాభిప్రాయలు వ్యక్తం చెయ్యటానికి భయపడని రోజు రావటమే.
kumar Jan 16, 2010 9
తెలంగాణలో సమైక్యాంధ్ర ఉద్యమం గురించి మాట్లాడే ధైర్యం ఎవరికీ లేదు. వరవరరావు, సి.పి.ఐ.నారాయణ ఆంధ్రప్రాంతం వెళ్ళి తెలంగాణ కావాలని ఎలుగెత్తి చెప్పగలరు. ఎందుకని? తెలంగాణలో సమైక్యాంధ్ర కోరేవారుసైతం నోరుమెదపక మౌనంగా ఉంటున్నారు. బెదిరింపులు, బ్లాక్ మెయులింగ్ , దౌర్జనం మాత్రమేఉన్న వాతావరణాన్ని తెలంగానణ ప్రజలుసైతం ముందుముందు ఎలా భరించగలరు?
ఇక సమైక్యాంధ్ర అంటే తెలంగాణ అంటే ద్వేషమేనా?అది తెలంగాణాకు వ్యతిరేకమా? వాళ్ళు చేసిన సమైక్యాంధ్ర ఉద్యమం తెలంగాణాకు వ్యతిరేకంగా ఉన్నట్లు చేసారే తప్ప సద్భావన లేదు. అది నాయకులు చేసిన తప్పు. ఆంధ్రప్రాంతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు మినహా సామాన్యులు అందరం కలిసి ఉందామనే కోరుకుంటున్నారు.
ఒకవేళ విడిపోవలసివస్తే ఇలాగేనా? మనకున్న సమస్యలన్నిటికి తక్షణపరిష్కారం పొరుగువారే అన్న అభిప్రాయాన్ని నాయకులు, పత్రికలు, టివి చానెళ్ళు చక్కగా ప్రచారం చేస్తున్నాయి. అనుచితమైన, అవాంచితమైన విద్వేషాలను రగిలిస్తున్నాయి. కొట్టుకుచావండని పురిగొల్పుతున్నాయి. మనలోని అల్పత్వాన్ని నిద్రలేపుతున్నాయి.
కలిసి ఉండటం, విడిపోవడం ఈ రెంటివల్ల వచ్చే లాభనష్టాలు దేవుడికెరుక. ఏదిజరిగినా ద్వేషభావాలు రెచ్చగొట్టవద్దని నాయకులను, విద్యార్థులను, మీడియాని ముఖ్యంగా కవులని కోరుదాం. ద్వేషం దావానలం అరణ్యాలను దగ్ధం చేసినట్లు ప్రజలను (అది ఎవరైనా) తేలికగా విడదీస్తుంది. విద్వేషాగ్నికి పురిగొల్పుతుంది. ప్రేమ ఎంత కష్టం.
madhurasree Jan 16, 2010 10
హరగోపాల్ కవిత చాలా బాగుంది
మధురశ్రీ అనంతపురం
pravallika Jan 16, 2010 11
ఆరి సీతారామయ్య గారి వాదనతోని నేను పూర్తిగా ఏకీభవించడము లేదు తెలంగాణ వాళ్ళు
అందరితోని పోటీ పడాలన్నారు పేదరికము తో ఇబ్బందులు పడుతున్న వారు ఎలా పోటే పడతారో చెప్పాలి వినంమ్రంగా అదుగుతున్నాను
haragopal Jan 16, 2010 12
ఆరి గారికి,తిరునగరి గారికి,కుమార్ గారికి మీ ఆదరాభిమానాలకు థాన్క్స్.
నేనన్నదానికి మీరు రాసినదానికి ఏమన్నా పురంటి వుందా? కొలువుల గురించి తెలుసుకుని మాట్లాడఛేతగాక రెచ్చగొట్టే రాతలు రాసిందెవరు? మీరెవరికి ప్రతినిధులు?మేము మాబాధలు చెప్పుకున్నమ్.ఆలోచించడమ్ చాతగానివాళ్ళతో వాదనలు దండగే.
satyadarshana Jan 24, 2010 13
there are many job vacancies in australia . including washing of empty beer bottles, cleaning the floors of pubs and looking at the motherless sky with dead eyes. the sky, always blue blue blue for ever. are you hold tools with me?.
Srinivas Bodduluri Jan 24, 2010 14
Dear Sitaramayya and Satyanarayana,
just look at the response of haragopal to your apologetic criticism. The fault does not lie in haragopal or his so called poem. He, his poem and the inspiration for his poem are characteristic of jingoism. The fault lies with people like us. We have allowed and accepted separatists to appropriate the idiom of the oppressed and apply it to separatist movement. now it has reached the stage of fascism. the future of non-telangana people in this area is going to be nothing less than persecution.
haragopal Jan 26, 2010 15
ఉద్యోగాలు,పొలాలు,భాషామర్యాద,సాన్స్క్రుతికగౌరవమ్,రాజకియాధికారాలు అన్నీ ఎవరు తమవేనని అంటున్నారో వాళ్ళతొనే మా గొడవ.మమ్మల్ని ఉన్నచోట బతకనీయకుండ చేసినవాళ్ళతోనే మా తగాదా.ఫాసిస్టుగుణసమ్పద మాకు లేదు.అయినా అందరు ఆంధ్రులతో మాకు భేదమేమి లేదు.ఊరికే బూచిని కల్పించే మేధావులతోనే రగడంతా.
ramnarsimhareddy Jan 27, 2010 16
చర్చలొ పాల్గొన్న అందరికి ధన్యవాదాలు.
ఒక తెలంగాణావాది.
నల్లగొండ.
08680_275125
visal Jan 28, 2010 17
హరగోపాల్ నువ్వు చెప్పింది బాగుంది. కాని కవిత ఎంతమాత్రం బాగోలేదు. వ్యాసం రాయాల్సింది. అది కవిత అని నువ్వు దబాయిస్తే చదివినవాడి ప్రారబ్దం. ప్రాణహితవారు వ్యాసాలు(కవితలు) దొరకపోతే వెయ్యడమం మానేయాలి. అంతేకాని ఇలాంటి చెత్తను ఇలా జనం మీదకు సాహిత్యం పేరుతో వదలకూడదు.
haragopal Jan 31, 2010 18
ఎవరికి ఏదిష్టమో అదే నచ్చుతుంది.సంస్కారమే కొలమానమ్.
చాకిరేవు ఉపేంద్ర Jan 31, 2010 19
మా వూరి అవుసులోనికి ఇంతకన్న తెలివుంటది. వాడు కత జెప్పినా, పాట బాడినా, ఏర్పాటు జేసి మతలబెందో ఎరిక జెప్పినా వినబుద్ధయితది.
హరగోపాల్ చెప్పిన కవితలో ‘సదుకుని సెడి పోయిన’ అన్నదొక్కటి తప్ప మిగిలిందంతా నాన్సెన్స్.
నాపైట తగలేసుకుంటా, నీ చేతిలో గ్రెనేడునై పేలుతా, వాడి ముక్కులో తుపాకీ పెట్టి కాల్చేస్తా లాంటి కవితలు ఆగినయ్యి అని ఎగబీల్చే లోపట్లనే మల్ల దాని గుడిసెల్లో tvtv కుండలు బద్దలుగొడతా, నా గోద పెండతో నీ ఇంటిముందు పిడకలు గొడతా లాంటి కవిత్వాలు వచ్చి పడుతున్నాయి.
ప్రవళ్ళికా, అభ్యంతరం రాజకీయానికీ కాదు, ప్రాంతీయ భాషకీ కాదు. ప్రజలని గురించి రాయడం పట్లా కాదు. ఈ కవితలో ప్రజలతో మమేకం కావాలన్న తపన కానీ, ప్రాంతీయ భాష లో సాధన చేయాలన్న కోరిక గాని, జన చైతన్యాన్ని మరొక్క మెట్టు ఎక్కించాలన్న ఆలోచన గాని, తను చేపట్టిన సాహిత్య సాధనం – వచన కవితని జాగ్రత్తగా మలచుకోవాలన్న సోయ గానీ ఏమీ లేవు. అదీ అభ్యంతరం.
నాకు జాబ్ రాలేదు. వానికి వచ్చింది. నేను మల్ల పిడకలు గొట్టుకుంట. నీ యవ్వ థూ!
ఇదీ ఈ కవితా సారాంశం. తిక్క ప్రయోగాలు – కన్నీటి తులాభారం అంటే ఏమిటో ఎవరయినా చెప్పగలరా ? అందులో ప్రాంతీయత ఏమిటో చెప్పగలరా ?
ఇది కవిత ఎట్లయితదిరా అని ఎవరయినా అడిగితే – అర్ధం చేసుకోలేని కుసంస్కారం నీది . థూ అన్నట్లు జవాబు.
ఇంగ ఎవరు చెప్పగలరు?
ఇటువంటి కవి హృదయాలని ఆవిష్కరించిన ప్రాణహిత సంపాదకులకి వొక దండం పెట్టుకుని , భగవంతుడు వీరికీ సద్భుద్ధి ప్రసాదించు గాక ఆమెన్ అనుకుని నిష్క్రమిస్తూ
చాకిరేవు ఉపేంద్ర
kiran Feb 1, 2010 20
తన కవితను కవి ఇంతగా సమర్థించుకోవాలా. థూ….
bhaskar Feb 1, 2010 21
కయితవాయె..
చాకిరేవు ఉపేంద్ర Feb 1, 2010 22
కిరణ్, దమ్ముంటే , మావూర్లెకొస్తే , లెక్కలు జూయిస్తం అన్నది పట్వారీ బెదిరింపు కావచ్చు. కవి సమర్ధింపు ఎట్లయితుందో ?
తెలంగాణ వూర్లల్లోకొచ్చిన కష్టం తక్కువది గాదు. 250 మంది ఆత్మహత్యలు చేసుకున్నరు – తెలంగాణ మీద ఆశ బెట్టుకుని.
ఇంత కష్టానికి గుంటూరు గుడిసెలెట్ల కారకమైనాయో , ఇంతవరకు వొక్క పరిశోధనాత్మకమైన వ్యాసం ఎవరూ రాయలేదు. ఇన్ని యూనివర్సిటీలు, ఇన్ని కాలేజీలు – వుంది ఒక్క వూరి లో గుంటూరి గుడిసెల పాత్ర మీద వొక్క ఎం.ఫిల్ థీసిస్ కూడా రాయలేక పోవటానికి కారణమేమిటో?
అందుకే అన్న, సదూకుని చెడిపోయింరన్న మాటోక్కటి నిజం అని.
హరగోపాల్ దగ్గర లెక్కలుంటే, అట్లాంటి వ్యాసం రాయాలే. అది చదివి విషయం తెలియనోల్లు తెలుసుకుని మరొక్క పదిమంది ఔర బై, ఈన జెప్పింది వాజబే అనాలే. నిజానికి తెలంగాణలో గాని, వుత్తరాంధ్రలో గాని, రాళ్లసీమలో గాని, అసుంటి వ్యాసాలు రాసినోల్లు లేక గాదు. అట్ల రాసినోల్లందరు స్కూల్ టీచర్లే. అంటే పెద్ద పెద్ద డిగ్రీలక్కర లేదు. దిమాగుండి, కలేజ వుంది తెలిసిన విషయం నలుగురికీ చేప్పాలనున్నో డెవ్వడైన రాయొచ్చు. ఈ విషయమ్మీద మాత్రం ఎవరూ రాయలేదు.
గా రహస్యమంత మా తాత సందూకులున్నది. మా వూర్లెకొస్తే పలగ్గొదత – నేను సదుకున్నోన్ని,కవిని అని గల్ల బట్టుకుంటే మరి గిట్లనే వుంటది.
మావూరి అవుసులోని పేరు వుత్తగనే దియ్యలేదు. ఆయన ఔజార్ల పెట్టె జూస్తే తెలుస్తది – పని తెలిసినోడు పనిముట్లు ఎంత పైలంగా బెట్టుకుంటడో. కవికి పదం, వాక్యం, అర్ధం గూడ అట్లనే. దేనికి దేన్ని వాదాల్నో తెల్వకపోతే వేళ్లు తెగుడు. చీజ్ ఖరాబ్.
ప్రాణహిత » ప్రాణహిత జనవరి 2010 సంచిక Feb 5, 2010 23
[...] ఇప్పుడు నువ్వన్నదే సై – హరగోపాల్ [...]
Rajesh Devabhaktuni Feb 6, 2010 24
అరి సీతారామయ్య గారితో నేను ఏకీభవిస్తాను. ప్రశాంతంగా ఉన్న ప్రజల మనస్సులో ఇలాంటి వైషమ్యాలు రేపింది రాజకీయ నాయకులు. పదవి కోసం గడ్డి తినదానికైన సిద్దంగా ఉన్నారు. 1930 కాలంలో హైదరాబాద్ సంస్థానంలో బాగంగా ఉన్న తెలంగాణా ఇప్పుడు వారికి పదవులు, పరపతి అవసరం అయ్యేటప్పటికి “తెలంగాణా సంస్థానంలో హైదరాబాద్ ఒక బాగంగా మారిపోయింది.” చిత్తశుద్ది లేని పని వర్దిల్లదు అన్నట్లు, చిత్తశుద్ది లేని నాయకులు ఎంత మంది ఇలాంటి దొంగ రాజకీయాలు నడిపి….సాదించిన తెలంగాణా అబివృద్దిపదంలో ఉండదు అనడంలో అతిశయోక్తి లేనేలేదు.
parashu Feb 10, 2010 25
చాకి రెవు ఉపెంద్ర గారు మీది ఏ ఊరొ చెప్పగలర………….
నువ్వు తెలంగాన ఐతె అల మాట్లాదవు…………….అసలు ఉద్యమాలు అనెవి ఎలంతి పరిస్తితుల్లొ పుత్తుకొస్తవొ తెలుసుకొ……..
అరి సితరామయ్య తరతరాల నుంది ఆంద్ర బూర్జువాల చెతుల్లొ అనచివెతకు గురి ఐన తెలంగాన ప్రజలు ఇప్పుడు ప్రత్యెక రాస్త్రాన్ని కొరుకుంతున్నరు అందులొ తప్పెంటి………..తెలంగాన్ అనెది మీరు అన్నట్లు పాసిస్టు ఉద్యమ్ కాదు ఎవరొ కొందరు కొన్ని తప్పులు అన్ననంత మాత్రన అది పాసిస్తు అయిపొదు…………….తెలంగాన ప్రజల ఆకలి,అవమానల్ నుండి,అనిచివెతల నుండి పుట్టూకొచిన ఉద్యమం అది…………..
హెచ్చార్కె Feb 12, 2010 26
ఆరి సీతా రామయ్య ప్రత్యేక రాష్ట్రం కావాలనే తెలంగాణ ప్రజల ప్రజాతంత్ర డిమాండును విస్పష్టంగా సమర్థించారు. ఆ తరువాత ఉద్యమంలో ముందుకొచ్చిన ‘ఫాసిస్టు’ ధోరణులను తిరస్కరించారు. ఎంత మెత్తగా ఉన్నప్పటికీ, కవి ఉద్దేశం అది కానప్పటికీ; హరగోపాల్ కవితలోని ‘గుంటూరి గుడిసెల’ ప్రస్తావన, ఆంధ్ర ప్రాంత పేదల(గుడిసెల)ను టార్గెట్ చేస్తుంది. ఉద్యమంలోని ‘ఫాసిస్టు’ధోరణులకు ఊతం ఇస్తుంది. సీతారామయ్య ఈ సందర్భంగా కొందరు ‘ముఖ్య’ నేతల దూకుడు మాటల్ని ఉటంకించి, అవి ఎలా ఫాసిజమో వివరించడం పూర్తిగా సందర్భోచితం.
నిజానికి ‘ఫాసిస్టు రాజకీయం’ కేవలం ‘ఇతరుల’ కే కాదు, అది ఎవరి పక్షాన వున్నట్టు కనిపిస్తుందో ఆ ‘ప్రజల’ కు కీడు చేస్తుంది. తెలంగాణ వుద్యమంలోని కొందరి ఫాసిస్టు ధోరణి తెలంగాణ ప్రజలను ఒక అవాంఛనీయ పరిస్థితి లోనికి తీసుకెళ్తుంది. ఇప్పుడు అది చాల ‘ఉద్రేక పూరితంగా’, చాల ‘ఆకర్షణీయంగా’ కనిపించినా, ప్రజలు అప్రమత్తం కాకపోతే, తొందర్లోనే తన నిజ స్వరూపాన్ని బయట పెట్టుకుంటుంది. రానున్న ‘దొరల తెలంగాణ’ను ‘ప్రజల తెలంగాణ’గా మార్చుకోడానికి అదొక హింసాత్మక అవరోధమవుతుంది.
హిట్లర్ ను జర్మన్లు నెత్తిన పెట్టుకున్నారు. ప్రారంభంలో అతడిని నెత్తిన పెట్టుకున్న వారిలో యూదు జర్మన్లు కూడా వుండి వుంటారు. అధికారంలోనికి వస్తున్నప్పుడు హిట్లర్ ఉద్రేక పూరిత ఉపన్యాసాలకు, వాటి నాటకీయతకు జర్మన్ ప్రజలందరూ వూగిపోయారు. ముస్సోలినీ వ్యవహారం కూడా అంతే. ఫాసిజం మొలకెత్తే పద్ధతి దాదాపు ఎప్పుడూ ఇంతే. ఉద్రేక పరుస్తుంది. ఉర్రూతలూగిస్తుంది. ఆలోచించనీయదు. ఎటునుంచైనా ఆలోచన కనిపిస్తే/వినిపిస్తే ‘అన్య ధోరణి’ అంటూ ఉద్రేక పూరిత దాడి చేస్తుంది. చివరికి, తన పిల్లల్ని తాను తినే జంతువులా…అది ఏ ‘ప్రజా’ బలంతో ముందుకొచ్చిందో ఆ ‘ప్రజల’ స్వేచ్చనే హరిస్తుంది.
‘ఉంటే నాతో ఉండు లేదా నా ప్రత్యర్థిగా వుండు, నాలో ఏదైనా లోపం ఉందని చెప్పడమంటే, నాకు ‘శతృవు’గా మాట్లాడడమే’ అనే ఈ ధోరణి ఫాసిజం కాకపోతే మరేమిటి? ఇతరులలో ఏది ఉండకూడదనుకుంటున్నామో అది మనలోనే వుందేమో అని చూసుకోవాలి. అలా చూసుకునే మైండ్ సెట్ ను అలవర్చుకోకపోతే… ఇంకేదో సందర్భంలో సార్త్ అన్నట్టు…మనం అటు బానిసలుగానో ఇటు నియంతలుగానో ఉండిపోతాం. బానిసత్వం/నియంతృత్వం అనే భావనకు మనం దూరం కాలేము. బానిసత్వం, నియంతృత్వం ఒకే నాణానికి రెండు ముఖాలు. ఇందులో దేన్ని అంగీకరించినా రెండో దాన్ని అంగీకరించినట్టే.
ఉపేంద్ర (చాకిరేవు) వ్యాఖ్య చాల ఆలోచనీయంగా వుంది. కవితా వస్తువు పరంగా, రూప పరంగా విలువైన వ్యాఖ్యానం చేశారు. అవుసులోల్ల ఉదాహరణ ఎంత బాగా నప్పిందో. ఆయన మాటల్లొ స్వారస్యాన్ని చూడడం మానేసి, ‘మీది ఏ వూరు, మీరు ఏవిట్లు’ తరహా వ్యాఖ్యానాలకు దిగడం చూసి, ఉండబట్టలేక ఈ నాలుగు మాటలు రాశాను. మితృలు ఆలోచించాలని మనవి. మనం కోసం మనం ఆలోచించడానికి బద్ధకిస్తే, మన పేరిట ఇంకెవరో ఆలోచిస్తారు. మన ప్రయోజనాల్ని బలిపెట్టి వారి ప్రయోజనాలు నెరవేర్చుకుంటారు. కంచు కంఠాల ఉపన్యాసాల లోని డొల్లతనానికి అమాయకులు బలయిపోతారు. ఆ అమాయకులు ఎవరో కాదు, మనం… మనం కూడా.
బొల్లోజు బాబా Feb 12, 2010 27
నాపైట తగలేసుకుంటా, నీ చేతిలో గ్రెనేడునై పేలుతా, వాడి ముక్కులో తుపాకీ పెట్టి కాల్చేస్తా లాంటి కవితలు ఆగినయ్యి అని ఎగబీల్చే లోపట్లనే మల్ల దాని గుడిసెల్లో tvtv కుండలు బద్దలుగొడతా, నా గోద పెండతో నీ ఇంటిముందు పిడకలు గొడతా లాంటి కవిత్వాలు వచ్చి పడుతున్నాయి.
అద్బుతంగా చెప్పారు.
అస్థిత్వ ఉధ్యమాల పేరుతో కవిత్వం గా చలామణీ అవుతూన్న ఇలాంటి రొడ్డకొట్టుడు రాతలను చూస్తుంటే ఒక్కోసారి జుగుప్స కలుగుతుంది. ఆయా భావాల్ని వెలిబుచ్చుకోవటానికి వేరే సాహిత్య ప్రక్రియల్ని ఉపయోగించక, కవిత్వాన్ని కలుషితం చేసే విధానాలనుంచి తెలుగు కవిత్వం ఎప్పటికి బయటపడుతుందో!
పోనీ అలాగని అలాంటి కవితల్లో ఏమైనా సాహితీ విలువలుంటాయా అంటే, ముక్కలు కొట్టిన వాక్యాలను కలుపుకొంటూ పోతే ఓ పేలవమైన పారాగ్రాఫు తయారయిపోతుంది ఎంచక్కా.
ఈ మధ్య ఇతర భారతీయ కవుల కవితలు అనువదించటానికి చేస్తున్న పఠనం వల్ల తెలిసిందేమిటంటే, వేరే భాషలలో ఇలాంటి వెర్రిపోకడలు ఉన్నట్లు అనిపించటం లేదు. శుభ్రమైన కవిత్వం వ్రాస్తున్నారు అందరూ.
బహుసా తెలుగుకవిత్వానికి పట్టిన దౌర్భాగ్యమేమో ఇది.
మంచి సాహితీ విలువలు ప్రదర్శిస్తున్న ప్రాణహిత పై నాకున్న గౌరవం ఓ మెట్టు దిగింది.
నా పై అభిప్రాయాలు ఎవరినైనా నొప్పిస్తే క్షంతవ్యుడను
భవదీయుడు
బొల్లోజు బాబా
చాకిరేవు ఉపేంద్ర Feb 12, 2010 28
మాది ఏ వూరో చెప్తే ఆడ అవుసులాయనెవరని అర్సుకుంట పోతరో ఏం పాడో !
పుట్టింది గాంధీ దవా కాన లేబర్ రూమ్ల. పెరిగింది కిల్ల రోడ్డెంబడి. ఆడింది పెద్దేటి కాల్వెన్క. ఈ రెండూ వున్న వూర్లు ఆంధ్రలో అసల్కే లెవ్వు . తెలంగాణల కొద్ది గన్నే వున్నయి.
సదివింది ఉస్మానియాల. 1969 ల మా అమ్మమ్మోల్ల ఇంటెన్క సాకలోళ్ల పోరగాని కి తూటా దూస్కపోతే, నన్ను ఇంట్లకు తరిమి, గల్లీ చివర గరాజ్ తాలం పలగ్గొట్టి ఎవర్దో బండి తీస్కోచ్చి గా పోరన్ని గదే గాంధీ దవకానకు అట్లనే తూటా పేల్చిన సీయార్పీ వోని ముందునించే తీస్కపోయిన వీరేష్ మామ ఇప్పట్కీ నా కండ్ల ముందు తిర్గుతున్నట్లే వుంటది.
ఏం రుజువు సరిపోతది నేను తెలంగాణ అన్న దానికి? డీయేన్నే పరీక్ష బెడ్తరా?, పుట్టుమచ్చలేడున్నయో సూయించమంటరా? యాదగిరి గుట్ట కెన్ని మెట్లున్నయో జెప్తరా?. మెట్టుకొక తెలంగాణ కత నేన్జెప్త. అదిగినన్క యినాలె మరి
‘మంచి అన్నది మాల అయితే మాలనే అగుదున్ ‘ అన్నడొక కవి. ఆయన తెలంగాణల పుట్టలేదు. ఆయన్నుంచి నేనొక పాఠం నేర్చుకున్న. నాకు తెలిసిన ఒక తెలంగాణ మా వీరేశు మామ. మంచి అన్నది, దైర్నమన్నది తెలంగాణ అయితే నేను తెలంగాణే అగుదున్!
“నేను జేసిన పని ఎట్లున్న గాని నువ్వు బెహతరీన్ అనాలె. అట్ల నకుంటె నీదే తప్పు” అనుడే తెలంగాణ అయితే – ఏమంట ?
చల్ర బై గీయింత దానికి లొల్లెందు కు? నువ్వ న్నదే సై తియ్యి అంట.
హెచ్చార్కె Feb 12, 2010 29
వావ్, భలే జెప్పినవ్ ఉపేంద్రా! చెప్పాల్సిన మాట శాన బాగ జెప్పినవ్. అలాగని, “చల్ర బై గీయింత దానికి లొల్లెందుకు? నువ్వ న్నదే సై తియ్యి అంట”నని విసుక్కోనక్కర్లేదనుకుంటా. ఇంతకు ముందు వ్యాఖ్యలో “గా రహస్యమంత మా తాత సందూకులున్నది. మా వూర్లెకొస్తే పలగ్గొదత – నేను సదుకున్నోన్ని, కవిని అని గల్ల బట్టుకుంటే మరి గిట్లనే వుంటది” అన్నవు. ఎందుకో ఆ మాటతో నాకు … నారాయణ స్వామి ఇటీవలి పుస్తకం ‘సందుక’ గుర్తుకొచ్చింది. స్వామి ‘సందుక’లో తెలంగాణ చేతన వుంది. తెలంగాణ భాషను ఒడుపుగా వాడుకోడం ఉంది. ‘మా వూర్లెకొస్తే పలగ్గొడ్త’ తరహా వ్యక్తీకరణల్లేవు. అంతకన్న ముఖ్యంగా… ఉద్యమ ‘నాయకుడి’ గురించి తగిన హెచ్చరిక కూడా వుంది. తెలంగాణ పక్షాన నిలబడుతూనే, ‘నాయకుడి’ గురించి హెచ్చరించిన స్వామి పద్యాన్ని ఇక్కడ గుర్తు చేయాలనిపించింది.
“తెలంగాణ కోసం ఉద్యమం షురువయినప్పుడు” నాయకుడితో అవ్వ (అంటే, తెలంగాణ) ఇలా అంటున్నది: “మేము మునుపటి లెక్క/ యేమి తెల్వనోల్లం గాదు// యేండ్లుగ దొరల రాజ్యం/పాలల్ల యిసమూ నీల్లల్ల నెత్తురూ కలిపిన/ మా బతుకులు/ మాకు ఊపిరి తీసుకున్నట్టె కొట్లాడ్డం గూడ నేర్పినయి// నువ్వు మనందరి కోసం నిలబడితె పానమిస్తం// గట్టెక్కినంక నీ తొవ్వ నువ్వె జూసుకుని/ మా నెత్తుల చేతులు పెడితె/ పానంతోటి పాతరేస్తం”. (‘ఒక్క ముచ్చట’). ఉద్యమంలో ప్రజా శక్తులు అప్రమత్తంగానే ఉన్నయ్. ఉంటయ్.
haragopal Feb 12, 2010 30
నా కవిత మీద ఇన్ని వాదాలు,భేదాలు రాసిన,రాస్తున్న వారు నేనెందుకు రాసానో, ఏమి రాసానో అనే దానికన్నా ఇతరమైన సంగతుల మీదే చర్చావేదిక నడిపారు.
కళ్ళముందరి నిజాలు అంగీకరించే నిజాయితి లేనపుడు ఏదిరాసినా ఓర్చుకోలేరనేది స్పష్టమ్.
ఎవరిది పలగ్గొడుత అనలేదు నేను.
ఫాసిజమ్ అంటె వీరి నిర్వచనాలనే చదివినేర్చుకొమ్మనే జబర్దస్తి లెక్కుంది.
మీ వివాదాలు అక్కర్లేదు, శివాలూగిపోయే పనీలేదు.
అంతరంగాలు ఆవిష్కరించే పనిచేయండి నిజంగా, అదిచాలు.
ravikran timmireddy Feb 12, 2010 31
ఒక్క ఆ గుంటూరి గిడిసెల తప్ప ఇక ఇందులో అంత తప్పుపట్టే విషయవేవుందో నాకు తెలియట్లేదు. శీతరావయ్యగారు వ్రాసింది చాలా బాగుంది, కానీ అసల ఆ కవితని గూర్చి ఏవైనా వ్రాసినట్టునాకిపించలేదు. నిజవే, ఆయనగారు చెప్పిన ఆ ఫాసిస్టు ధోరణులు, ఏవధందంగా అవి ప్రజాస్వామ్య పోరాటాలని ప్రభావితం చెస్తాయోనని ఆయన పద్దతిగానే చెప్పేరు. కానీ ఈ కవితలో వారికి స్పురించిన ఆ ఫాసిస్టు ధోరణులు ఏవో నాకు అవగతం కాలేదు. నిజవే రచయిత కొ్చం ఆవేశంతోనే ప్రతిస్పందించారు. కానీ ఆ ప్రతిస్పందనకి మన స్పందన గురించి మనమ్ ఆలోచించాలేవో? మంచికో, చెడుకో అందరూ, హెచ్చార్కే గారితోబాటూ అదే ధోరణిలో పొయ్యారు. అరె ఈన ఏంవ్రాశాడు, మనవేం మాట్లాడుతున్నావ్ అనే అవగాహనలేకుండా.
బల్లోజు బాబా గారు, అదేదో సావెత చెప్పినట్టు, అక్కడెక్కడో గిల్లి, క్ష్మామాపనలు చెప్పినందువలన ఉపయోగంఏవిటండి?
హరగోపాల్ గారు, మీరు గుంటూరు గుడిసెలనడం బాగలేదండీ. గుడిశలు ఎక్కడైనా ఒకటే. వాటికి తెలంగాణా, కోస్తా, రాయలసీమ, తలిళనాడు, బీహారు అనే భేదాలుండవండి. గుడిశెలెక్కడైనా ఒకటే. ఆ గుదిశెల్లో బతుకు దేశంలో ఎక్కడైనా ఒకటే. అందుకని ఆ ఒక్క విషయంతప్ప మీ కవిత మహా భేషుగ్గా వుందండీ. దాంట్లో, కనీసం నాకు అనుమానవేం లేదు. వ్రాయండి, మీకు నచ్చిన వాటిమీద, మిమ్మల్ని ముల్లుతో గుచ్చిన వాటి మీద, మీ మనసు బయటకు కనపడకుండా కన్నీరు కార్చిన వాటిమీద. మీరు వ్రాయగలరు, మీరు వ్రాశారు. చుట్టూ జరిగే వాటిమీద మీరు ప్రతిస్పందించారు. నా ఉద్దేశంలో కవికి కావాల్సిన ముఖ్య లక్షణం అదొక్కటే.
ఏది కవిత్వవో, ఏది కాదో నిర్వచించే వాళ్ళని వినండి కానీ, మర్చికూడాపోండి.
రవికిరణ్ తిమ్మిరెడ్డి.
బొల్లోజు బాబా Feb 13, 2010 32
కిరణ్ గారికి
బల్లోజు బాబా గారు, అదేదో సావెత చెప్పినట్టు, అక్కడెక్కడో గిల్లి, క్ష్మామాపనలు చెప్పినందువలన ఉపయోగంఏవిటండి?
నే వెలిబుచ్చిన అభిప్రాయాలతో కొంత మంది పాఠకులుంటారన్న విషయం నలుగురికీ తెలుస్తాదన్న “ఉపయోగం” కోసం అండీ
భవదీయుడు
బొల్లోజు బాబా
హెచ్చార్కె Feb 13, 2010 33
రవికిరణ్,
చర్చ ఆ ఒక్క వాక్యం గురించయితే, అది మొదటి వ్యాఖ్యతోనే ముగిసింది. హరగోపాల్ ‘దమ్ముంటే’, ‘సంస్కారమ్’ వంటి రకరకాల తీవ్ర పదజాలంతో జోక్యం చేసుకోడం వల్లనే చర్చ నడిచింది. పరశు… మీదేవూరు… అని ఉపేంద్రను ప్రశ్నించడం దానికి పరకాష్ట. మొత్తం చర్చలో ఈ ఫాసిజం ఛాయలను గుర్తించలేకపోతే… గుర్తించని దాన్ని నివారించలేం గనుక… ఫాసిజం అయినా ఫరవాలేదని రాజీ పడడమే అవుతుంది.
కవితా వస్తువు చాల సున్నితమైనది. తెలుగు వాళ్లం… ఎవరం ఏ పనిలో ఉన్నా… నిత్యం మన ఆలోచనల్ని ప్రభావితం చేస్తున్నది. భయపెడుతున్నది. విచికిత్సకు గురి చేస్తున్నది. అందువల్లనే చర్చ అంత ఘాటుగా జరిగింది. ఇలాంటి సందర్భాల్లో మాట్లాడుకోడానికి బద్ధకించకపోవడమే మంచిది. కాస్త విసుగులు, మనస్ఫర్థలు దొర్లినా ‘మాట్లాడుకోడమే’ మంచిది. మాటలు లేని చోట, ‘ఇంకేవో’ ఉంటాయి.
bhaskar Feb 13, 2010 34
ఇంత చర్చ జరిగింది కనుక ఇదొక గొప్ప కవిత అనుకోవాలా…? కవితగాదంటే కవులంతా మనకి సంస్కారం లేదంటారేమో ముందుముందు. సత్కవులంతా ఆలోచించుకోవాలి.
ఉద్యమ సాహిత్యం తెచ్చిన చేటు ఇదే. నాది కవిత కాదంటే కాలెత్తి కొడత. వి.వి. ఇన్కెంత గొప్ప సాహిత్యం రాసాడో తేలాలి…ముందుముందు…
విప్లవకారులు ముప్పై సంవత్సరాలుగా ముక్కుముడుచుకుని కూర్చున్నారు తెలంగాణ గురించి మాట్లాడకుండ. ఇప్పుడు కాదంటే వాళ్ళకి పుట్టగతులుండవని వాళ్లకి తెలుసు.
కవిత గురంచే చర్చించమని అందరూ అంటున్నరు. మరందులో కవిత్వం ఎంత ఉంది?
sasi Feb 13, 2010 35
there are many job vacancies in australia . including washing of empty beer bottles, cleaning the floors of pubs and looking at the motherless sky with dead eyes. the sky, always blue blue blue for ever. are you hold tools with me?.
దీని అర్థమేమి తిరుమలేశ..?
baasha Feb 13, 2010 36
మథ్యలొ ఈ తిరుమలేసు ఎవరు ? శశీ గారు. కొంచెం వివరిస్తారా….
okadu Feb 13, 2010 37
రవికిరణ్ ఆభీప్రాయం చాలాబాగుంది
srikanthachaary talli Feb 13, 2010 38
అయ్యలూ కల కాలం కవితల సారం గురించి చర్చించుకుంటూ వుండండి
చాకిరేవు ఉపేంద్ర Feb 13, 2010 39
ఇక్కడ విషయానికి మూడు పార్శ్వాలున్నాయి. పార్శ్వాలు అని అంటున్నాను కనక అసలు విషయాన్ని ముక్కలు ముక్కలుగా చేస్తున్నానన్న ఆందోళన అవసరం లేదు. విడి విడిగా ఒక్కొక్క పార్శ్వంలోనూ క్లారిటీ వచ్చిన తరువాత వాటిని మళ్ళీ ఎట్లా అనుసంధానం చేసుకోవచ్చునో ఆలోచించుకోవచ్చును. పని వొత్తిడిలో వుండటం వలననూ , సంభాషణా క్రమంలో పూర్తి స్థాయి సైద్ధాంతిక వ్యాసం అవసరం లేదు కనకనూ, నా వరకు నేను చెప్పవలసిన విషయాన్ని బిందు రూపంలో వ్రాస్తున్నాను. (తెలంగాణం వదిలి అధికార భాష లో రాయటానికి కారణం ఏమిటి అని ఎవరికయినా అనుమానం రావచ్చు. అన్నీ పనులకీ ఒకే భాష సరిపోదు. ఇక్కడ విషయం చెప్పటానికి ఈ భాషలోనే తేలికవుతుంది. )
1. మూడు పార్శ్వాలలో మొదటిది కవితా, దాని వస్తువు, సారమూ, రూపమూ, కవి నైపుణ్యమూ మొదలైనవి; రెండవది అభివృద్ధిలో అసమానతలూ, ఆధిపత్యమూ, శోషణా – వీటి చలన సూత్రాలు; మూడవది వుద్యమ నిర్మాణమూ, తీరుతెన్నులూ, దిశా నిర్దేశమూ మొదలైనవి. వుద్యమం మీద విమర్శ ని కవిత్వం మీద విమర్శలో కలిపెసుకునే ముందూ, అలాగే, చలనసూత్రాల పట్ల అవగాహన మీద చర్చ ని కవిత్వం మీద చర్చతో కలిపేసుకొనే ముందూ, విడి విడి గా కొంత క్లారిటీ సాధించు కోవటం వలన మంచే జరుగుతుంది కానీ నష్టమేమీ వుండదు.
2. రాజకీయ నాయకులు అనే మాటలకీ, చేసే చేతలకీ కవినీ , వుద్యమంలో పాల్గొనే ప్రతి వ్యక్తినీ బాధ్యులని చేయ వలసిన అవసరం లేదు. కవితలో గుంటూరు గుడిసెలు అన్న మాటని నిజానికి నేను ఫాసిజం ఛాయగా అర్ధం చేసుకోలేదు. కానీ, కవిగా కృషి చేయాలి అని అనుకున్న మనిషి ప్రతి పదమూ ఆచి తూచి వేయాల్సి వుంటుంది. కవిత్వ విలువ నిరూపించటానికి రాజకీయ స్పర్ధని మార్గంగా తీసుకోవటమో, కవిత ద్వారా రాజకీయ స్పర్ధని గెలవగలమనో అనుకో కూడదు. ఇదీ నా అభ్యంతరం.
3. హరగోపాల్ మంచి కవిత రాయాలి. కాకపోతే మంచి వ్యాసం రాయాలి అన్నది నా కోరిక. దేని తూకం దానికి వుంటుంది. ఎవరి పుణ్యమో ఇప్పుడు అనవసరం గానీ, వీటన్నిటినీ కలగా పులగం చేసుకునే సంస్కృతి ఒకటి మనకు గత నలభై సంవత్సరాలుగా పెరుగుతూ వచ్చింది. 1995 ప్రాంతాలలో ఈ సంస్కృతి బాగా వేళ్లూనుకోవటం మొదలు పెట్టింది. ఆ సంస్కృతి తల్లి వేరు ఎక్కడుందో , దానికి ప్రత్యామ్నాయంగా కొత్త సంస్కృతులను ఎట్లా నిర్మించాలో ఆలోచించ వలసిన బాధ్యత కూడా కవిగానో, రచయితగానో నీమీద వుంది. అది కవులూ రచయితలూ అందుకోవాలని నేను కోరుకోవటంలో నిరంకుశత్వమేమీ లేదు.
4. కవిత ఎట్లా వుండాలి అన్న ప్రశ్నకి ఎన్నైనా సమాధానాలు చెప్పుకోవచ్చును. ఈ పూట నన్నడిగితే కవిత్వం అమావాస్య రాత్రి వొంటినిండా కాటుకా ఆముదం అలుముకున్న గజదొంగలా వుండాలి అని సమాధానం చెప్తాను. చీకట్లో మిల మిల మెరిసే నక్షత్రాలలాంటి కళ్ళు, కౌగిలించుకుంటే వినపడే గుండె చప్పుడూ తప్ప మరేమీ పట్టు చిక్క కూడదు. అతి సాధారణమైన విమర్శకి లొంగి పోయి సవాలు జవాబులకీ, సమర్ధింపులకీ ఒగ్గి పోకూడదు. తెలంగాణకి అలాంటి గజదొంగ లాంటి కవిత్వం చాలా అవసరం ఈరోజు అని నేనంటాను. నేను కవిత్వం రాస్తే, ఆ మదింపుకి తగినట్టు రాస్తాను. అట్లాగే హరగోపాల్ కి కూడా ఏదో ఒక మదింపు వుండవచ్చు. అదేమిటో తనకి తాను చెప్పుకోవలసిన బాధ్యత, దాని పట్ల నిబద్ధతతో వ్యవహరించటం హరగోపాల్ దే. అట్లాంటి మదింపుని గణనలోకి తీసుకోకుండా విమర్శకు లెవరూ న్యాయంగా మాట్లాడ లేరు. అదేమిటో వివరించకుండా , సీదాగా రాజకీయ విమర్శకి స్పందించటం వలన ఈ గందరగోళం వచ్చింది.
5. నేను ముఖ్యంగా స్పందించినది కవిత విలువకి. కాబట్టి దాని గురించి రెండు మాటలు చెప్తాను. తెలంగాణలో ప్రస్తుతం చాలా నిస్పృహ ప్రబలి పోయి వుంది. ఇటువంటి సమయంలో కవి చాలా జాగ్రతగా వ్యవహరించాలి. జెర్మన్ కవి రిల్కే వచనంలో చెప్పిన మాట వొకటి నాకు జ్ఞాపకం వస్తుంది.
విషణ్ణ వీణ ను మీటగోరే మిత్రమా, ఈ ఒక్క మాట విస్మరించకు. నువ్వు రాల్చిన ఒక్కొక్క దుక్ఖాశ్రువుకీ , నీ పేరున ఒక్కొక్క కిస్తు ఆనందం జమ అవుతోంది. విషణ్ణ వీణ ను మీటగోరే మిత్రమా, ఈ ఒక్క శపథం చెయ్యి. దుఖాన్ని పలికించిన తీగ మీదనే ఆనందాన్ని పలికిస్తానని .
మిస్టికల్ గా అనిపించొచ్చు. కానీ నిజానికి చాలా లోక జ్ఞానం వున్న మాటలివి. తీగ మీటితే కానీ, దుక్ఖాశ్రువు రాలదు. ఆనందం జమవుతోందన్న స్పృహ వుండక పోతే దుక్ఖం చాలా హాని కలిగిస్తుంది. జమయిన ఆనందాన్ని ప్రయత్న పూర్వకంగా తప్ప పలికించలేము. అల్లం రాజయ్య కథ ‘మనిషి లోపలి విధ్వంసం’లో మనకి కనపడేది ఈ రెంటికీ మధ్యనున్న స్థితి. గడ్డ కట్టుకు పోయిన తెలంగాణ రైతు దుక్ఖాన్ని తరిచి, తరచి, తడిమి తడిమి తచ్చాడి తారట్లాడి ప్రయత్న పూర్వకంగా రాజయ్య తీగ మీటితే రైతు జీవితంతో గాని, తెలంగాణ తో కానీ సంబంధం లేని వారికైనా సరే కన్నీళ్ళు జలజలా రాలుతాయి. ఎన్నో ఏళ్ల తరవాత చెట్టు కింద కూలబడి వల వల ఏడ్చిన మనిషి మళ్ళా నిలబడటానికి ఏదో చెయ్యాలన్న తాపత్రయం – దుక్ఖాన్ని పలికించిన తీగ మీదనే ఆనందం పలికించాలన్న స్పృహ ఆకథలో వున్నాయి. అక్కడికి అది ఆగింది. ఆ తరవాతి కథ ఎవరూ రాయలేదు. అట్లాంటి స్పృహ తో కొత్త కవిత్వం రాయాల్సిన అవసరం తెలంగాణ కి ఈ రోజు చాలా వుంది. అటువంటి స్పృహ లేకపోతే ఈ ఆత్మహత్యలను ఆపలేము.
6. సామాజిక చలన సూత్రాల గురించి చెప్పుకోవలసిన అవసరం వుంది. ఏ గుడిసెకి ఆ గుడిసెని కులాల వారీగా, ప్రాంతాల వారీగా , భాషల వారీగా వేరు చేసి చెప్పుకోవటం ఎంత పొరపాటో, అన్నీ గుడిసెలూ ఒకటే అని అనుకోవటం కూడా అంటే పొరపాటు. గుడిసెలు నిశ్చలంగా వుండవు. కొన్ని గుడిసెలు చాలా త్వరగా బంగళాలుగా మారుతాయి. కొన్ని గుడిసెలు ఎన్ని తరాలైనా గుడిసెలు గానే వుంది పోతాయి. వాటిల్లో మనకు తేలికగా అంతు చిక్కని వ్యవహారాలెన్నో వుంటాయి. గుంటూరు ప్రాంతం నించి తెలంగాణ వూర్లకు వచ్చిన కొన్ని కుటుంబాలు చాలా త్వరగా ఎదిగి పోవచ్చును. అన్నీ కావు. ఇది ఈ రోజున కొత్తగా మొదలైన వ్యవహారం కాదు. ఇది ఆంధ్ర – తెలంగాణ సమస్యకి మాత్రమే పరిమితమయింది కూడా కాదు. గుంటూరు నించి కోయంబత్తూర్ వెళ్ళి బాగు పడిన కుటుంబాలు చాలానే వున్నాయి. అలమట్టి ఆనకట్ట కింద కర్ణాటకలో గుంటూరు వారి భూములు చాలానే వున్నాయి. హరిత విప్లవం ద్వారా పంజాబు లో వచ్చిన సర్ప్లస్ ని ఉత్తర్ ప్రదేశ్ తెరాయీ ప్రాంతంలో పెట్టుబడిగా మార్చుకున్న పంజాబీ కుటుంబాలు చాలానే వున్నాయి. వ్యవసాయ రంగంలోని సర్ప్లస్ ని ఆధారంగా చేసుకుని ఎదిగిన సామాజిక వర్గాలు భారత దేశమంతటా కనిపిస్తాయి. ఒక్కొక్క దశలో ఇవే వర్గాలు చాలా అభ్యుదయకారకంగా కనిపిస్తే, ఒక్కొక్క దశలో చాలా కరుడు కట్టిన ఆధిపత్య వర్గాలుగా కనిపిస్తాయి. కులమూ, ప్రాంతమూ, భాషా , రక రకాలైన సక్రమ అక్రమ మార్గాల ద్వారా ఆర్జించుకునే సోషల్ , కల్చరల్ కాపిటల్ తిరిగి తిరిగి రీ యిన్ వెస్ట్ అవుతూ రావటం వలన ఇటువంటి ఎదుగుదల, అందులోనే మళ్ళీ కొన్ని వక్ర ధోరణులు రావటమూ ఇదంతా జరుగుతుంది.
తెలంగాణ లో అభివృద్ధి న్యాయంగా సమానంగా అందరికీ మేలు కలిగేలా జరగాలని కోరుకునే వాళ్ళకి ఈ క్రమాన్ని, దీని చలన సూత్రాలను క్షుణ్ణంగా అర్ధం చేసుకోవటం చాలా అవసరం. లేకపోతే అన్యాయమైన అభివృద్ధి క్రమం పట్ల నిరసన చాలా ప్రాథమిక స్థాయిలో మీదే వూరు, అని నిలదీసే కాడికే ఆగి పోతుంది. దేన్నైతే మనం ఈ రోజున నిరసిస్తున్నామో, అది మన ద్వారానే రిప్రొడ్యూస్ అవుతుంది.
7. ఉద్యమ నిర్మాణమూ దానిలో వున్న ధోరణులు, దిశా నిర్దేశము ఎట్లా జరగాలి ఇట్లాంటి వాటి గురించి మరెప్పుడైనా చెప్పుకోవచ్చును .
haragopal Feb 13, 2010 40
విమర్శించిన అందరికి థాన్క్స్.గుంటూరు అన్న మాట,గుడిసెలు అన్న మాట సన్కేతాలే.నేనేదో నా కవితను ఓ గోప్పగా రాసానని విర్రవీగలేదు.రూపాన్ని పట్టుకుని గొల్లుమంటె ఏమ్ చేసేది. ఎవరిని పడితే వాళ్ళని ఏది పడితే అది అనాలనే కోరికా కాదు. ఎవరీ అనర్థాలకు కారణమో వాళ్ళను పరామర్శిస్తే చాలు నా కవిత.రాజకీయాల రగడ కాదు నా ఉద్దేశమ్. విలువైన విషయాలు రాసిన అందరిని అభినందిస్తున్నా. నా కవిత ఒక సాకుగ ఇలాగే సాగతీతలు మీకు నచ్చితే ఆల్రైట్. నాకు మారుపేరుతో రాసే అవసరమ్ లేదు.అట్లా రాసింది నేను కాను.
హెచ్చార్కె Feb 13, 2010 41
సాగతీత అవుతోందని అనిపిస్తున్నా, అపార్థాలు తొలగించడం కోసం రెండు రిపిటిషన్లు:
1). “ఎంత మెత్తగా ఉన్నప్పటికీ, కవి ఉద్దేశం అది కానప్పటికీ; హరగోపాల్ కవితలోని ‘గుంటూరి గుడిసెల’ ప్రస్తావన, ఆంధ్ర ప్రాంత పేదల(గుడిసెల)ను టార్గెట్ చేస్తుంది. ఉద్యమంలోని ‘ఫాసిస్టు’ధోరణులకు ఊతం ఇస్తుంది.” ఊతం ఇస్తుందంటే అదే ఫాసిజం అని కాదు. ఉద్యమంలో ఆ ధోరణి ఉన్నప్పుడు, దానికి ఊతం ఇచ్చే మాట ఉద్యమ కవితలో దొర్లినప్పుడు, ఎత్తి చూపడం సరైనదే.
2) “చర్చ ఆ ఒక్క వాక్యం గురించయితే, అది మొదటి వ్యాఖ్యతోనే ముగిసింది. హరగోపాల్ ‘దమ్ముంటే’, ‘సంస్కారమ్’ వంటి రకరకాల తీవ్ర పదజాలంతో జోక్యం చేసుకోడం వల్లనే చర్చ నడిచింది.” దీనికి వివరణ అవసరం లేదు. ఆసక్తి ఉన్న వారు మొత్తం చర్చను మరోసారి చూడాలి.
హరగోపాల్, నా జోక్యం చర్చకు మాత్రమే పరిమితం. మీ కవితను మొదట చదివినప్పుడే ఎంజాయ్ చేశాను. ఒక నిర్దిష్ట వేదనను మీరు చాల బలంగా చెప్పారు. మాండలికంలో నప్పదు గాని, ‘కన్నీటి తులాభారం’ అనే వ్యక్తీకరణ కూడా నాకు బాగుంది. ఇక, రూప విమర్శ నుంచి మీరే కాదు, అందరం నేర్చుకోవలసిందే. ఆ ఉద్దేశంతోనే ఉపేంద్ర మాటలు బాగున్నాయన్నాను. లోలోపలి ఆవేదన కారణంగా, సందర్భం రావడంతో, కాస్త ఎక్కువగా జోక్యం చేసుకున్నాను. అదాటుగా… మిమ్మల్ని నొప్పించాను. సారీ.
చాకిరేవు ఉపేంద్ర Feb 14, 2010 42
హరగోపాల్,
రూపం గురించి గొల్లుమన వలసిన అవసరం చాలా వుంది. మనిషిదే వూరు, ఆయన అసలు పేరు ఆదేనా లాంటి ప్రశ్నలు కొంచెం పక్కకి పెట్టి, ఈ కింద లింకులో వున్నవ్యాసంలోని సారాన్ని చదివి చూడండి. తెలంగాణకీ కవిత్వానికీ కూడా పనికొచ్చే మాటలు కొన్నైనా కనపడవచ్చును.
http://tinyurl.com/yk9aoh8
చాకిరేవు ఉపేంద్ర Feb 14, 2010 43
లింకు లో పొరపాటున్నట్లుంది. సరైన లింక్ ఇది.
http://www.eemaata.com/em/printerfriendly/?id=547
Tirunagari Satyanarayana Feb 14, 2010 44
హరగోపాల్ కవిత మీద చాలా చర్చ జరుతున్నది. అయితే ముందుగా ఆయన కవిత లో రాసిన గుంటూరు గుడిసెలు అనే విషయం గురించి. కవిత లో గుంటూరు గుడిసె అనేది ఒక ప్రతీక మాత్రమే! ఏ గుడిసెలోనైనా పేదలే ఉంటారనే విషయం హరగోపాల్ కూ తెలుసు అని నేను అనుకుంటున్నా! అయితే తెలంగాణ ప్రాంతానికి వచ్చేసరికి ఉద్యోగ నియామకాల విషయంలో అన్యాయం జరిగిందనేది ఒక వాస్తవం. 610 జీవో అమలు జరగకపోవడం, ముల్కి నియమాన్ని తుంగలో తొక్కడం గత 50 ఏండ్లలో జరిగినవి. ప్రభుత్వం నియమించిన గిర్గ్లానీ కమిటీ ఉద్యోగ నియామకాల విషయంలో తెలంగాణ స్థానికులకు జరిగిన అన్యాయాన్ని చాలా స్పష్టంగా బయట పెట్టింది. అది ప్రభుత్వం పెడచెవిన పెట్టడం, 610 జీవో అమలుకు ఏ మాత్రం చొరవ తీసుకోకపోవడం తెలంగాణ ప్రజలను మరింత అన్యాయానికి గురిచేసింది. అందుకే కడుపు మండిన కవి ‘కొలువులు గుంటూరు గుడిసెల పాలాయె’ అన్నాడు. ఇక్కడ గుడిసెల్లో పేదవాళ్ళే ఉంటారనే స్పృహ కంటే అస్తిత్వ స్పహ ఎక్కువ కనబడుతుంది. అందులో తప్పు లేదు. చాలా సార్లు అస్తిత్వ ఉద్యమాలు, వాటి స్పృహతో వచ్చిన కవిత్వం ఒక విశాల దృక్పథ్, స్ఫ్రహా కంటే నిర్దిష్ట విషయాల మీదే కేంద్రీకరిస్తాయి. స్త్రీ వాద ఉద్యమం “పురుషులలో మంచి పురుషులు వేరయా” అనుకన్నట్టు నాకు గుర్తు లేదు.
అయితే హరగోపాల్ తన తర్వాతి సమధానాల్లో కొ్త ఉద్రేక పడ్డ మాట వాస్తవమే! అయితే దాని ఫాసిస్టు ధోరణి అని అనాల్సిన అవసరం లేదు. నిజానికి ఫాసిజం అనేది చాలా పెద్ద మాట. చారిత్రికంగా దానికి చాలా అర్థాలూ, పరమర్థాలూ ఉన్నాయి. హరగోపాల్ ది కానీ, ఇవాళ్ళ తెలంగాణ ఉద్యమం లో కొన్ని చోట్ల కనబడుతున్న ధోరణులు కానీ అప్రజాస్వామిక ధోరణులు మాత్రమే. కొన్ని కారణాల వల్ల (వాటికున్న అస్తిత్వ నిర్దిష్టత వల్ల) ధోరణులు ముందుకొచ్చినవి.. వీటిని తప్పనిసరిగా సరిదిద్దాల్సిందే! అయితే వాటిని ఫాసిస్టు ధోరణులని నిందించడం వల్ల వాటిని సరిదిద్దలేము. అట్లే ఈ ధోరణులని మాత్రమే చూపించి తెలంగాణా ఉద్యమాన్నే మొత్తంగా అప్రజాస్వామ్యమిక ఉద్యమమని, అది ఫాసిస్టుల చేతిలో ఉందనీ నిర్ణయానికి రావడమూ సరైంది కాదు. ప్రజాఉద్యమాల చరిత్ర కలిగిన తెలంగాణ ప్రజలు ఫాసిజాన్ని సమర్థవంతంగా తిప్పికొడతారు. తెలంగాణ ప్రజలు అంతిమంగా ప్రజాస్వామ్యాన్నే గెలిపిస్తారు.
ఇకపోతే చాకిరేవు ఉపేంద్ర (ఆయన ఈ పేరు ఎందుకు పెట్టుకున్నారో తెలియదు) చివరికి సాహిత్యం గురించి తన అభిప్రాయంగా వేల్చేరు గారి వ్యాసాన్ని చూపించారు. దాని గురించి ఇక్కడ ఒకటి రెందు మాటల్లో చర్చించడం సులభం కాదు. వేల్చేరు గారు ఆ వ్యాసంలో చర్చించిన ముఖ్య విషయం సాహిత్యం మంచిచెడ్దలు సాహిత్యం పరిధిలోనే జరగాలి, ఏది మంచి సాహిత్యమో సాహిత్యకారులే నిర్ణయిస్తారు అని. అంటే సాహిత్యానికి సామాజిక ప్రయోజనం ముఖ్యం కాదు, అది గొప్ప సాహిత్యం అనేది పిడికెడు సాహిత్యకారులే వారి వారి అభిరుచులను బట్టి నిర్ణయిస్తారు. సాహిత్యం చిత్రించిన వస్తువు గొప్ప వస్తువు కాకుండా, అది సమాజానికి ఉపయోగపడేది కాకుండా, దానివల్ల సమాజంలో అత్యధిక ప్రజానీకం ప్రేరణ పొందకుండా అది గొప్ప సాహితం ఎలా అవుతుంది? దాని గొప్ప తనాన్ని పిడికెడు కవులో, సాహిత్యకారులో విమర్శకులో ఎట్లా నిర్ణయిస్తారు? విమర్శకులు దాని గొప్పతనాన్ని విడమర్చి చెప్పవచ్చు కాక! కానీ అంతిమంగా ఆ సాహిత్యం ఏ ప్రజలని ఉద్దేశించి సృష్టించబడిందో ఆ ప్రజలే కదా దాని గొప్ప తనాన్ని నిర్ణయించేదయింసాహిత్యానికి రూపం మాత్రమే ముఖ్యం సారం కాదు అనే వాదనే కాదా ఇది? ఏది రాసినా గొప్ప సాహిత్యంగా రాయి కానీ సారమేంటో, వస్తువేంటో పట్టించుకోవల్సిన అవసరం లేదు అనడం కాదా ఇది? నిజమే ఎంత గొప్ప వస్తువైనా, సారమైనా గొప్ప గా చెప్పక పోతే అది మంచి సాహిత్యం కాదు. దాన్ని సమాజం గుర్తించదు. చిరకాలం అది నిలవదు. అందుకని గొప్పగా చెప్పడమే మంచి సాహిత్యానికి గీటురాయి అవుతుందా! అదీ కొంతమంది సాహిత్యకారులు గుర్తిస్తే అవుతుందా? ప్రపంచ సాహిత్య చరిత్రలో ఎక్కడైనా జరిగిందా అట్లా? టాల్స్టాయి, డాస్టోవిస్కీ, గోర్కీ, డికెన్స్ , నెరూడా, మయకోవిస్కీ, మార్క్వజ్ – ఏ గొప్ప సాహిత్యకారులైనా వారు సాహిత్యం లో తీసుకున్న వస్తువు గొప్పది కావడం వల్ల, అది జీవితానికీ, ప్రజలకూ చెందినది కావడం వల్ల గొప్ప సాహిత్యాన్ని సృష్టించారే తప్ప వాళ్ళెన్నుకున్న రూపం వల్ల కాదు. అట్లే వారి సాహిత్యాన్ని ప్రజలూ, సమాజమూ గొప్ప సాహిత్యంగా నిలబెట్టాయి తప్ప ఏ పిడికెడు ‘అభిరుచి’ ఉన్న సాహిత్యకారులో కాదు. ప్రపంచంలోని గొప్ప సాహిత్యం అంతా, సాహిత్యరంగం దాని విశిష్టతనిలుపుకుని ఆ రంగం మేరకే విశ్లేషించి గొప్ప సాహిత్యమని నిర్ధారణ చేయబడలేదు. అది చిత్రించిన జీవితం వల్ల, వస్తువు వల్ల, దాన్ని అక్కున చేర్చుకున్న ప్రజల వల్లా, పదిల పర్చుకున్న సమాజం వల్లా గొప్ప సాహిత్యంగా నిలిచి పోయింది.
బొల్లోజు బాబా Feb 14, 2010 45
తిరునగరి గారికి
మీ ఉద్దేసం సాహిత్యం కవిత్వం ఒకటే ననా? కవిత్వం అంతా సాహిత్యం కావొచ్చేమో కానీ సాహిత్యమంతా కవిత్వం కాదు కదా?
ఇక్కడ జరుగుతున్న చర్చ కవిత్వం గురించననుకొంటున్నాను.
Tirunagari Satyanarayana Feb 14, 2010 46
బాబా గారూ – అవును నిజమే! సాహిత్యమంతా కవిత్వం కాదు. కవిత్వం సాహిత్యం లో ఒక భాగం! ఉపేంద్ర గారు సూచించిన వేల్చేరు గారి వ్యాసం సాహిత్యం మొత్తాన్ని పరిశీలిస్తుంది. కాబట్టే సాహిత్యం అన్నాన్నేను.సాహిత్యానికి సంబంధించిన ప్రతి చర్చ కవిత్వానికీ వర్తిస్తుందనే నేననుకుంటునాను.
bollojubaba Feb 14, 2010 47
సాహిత్యానికి సంబంధించిన ప్రతి చర్చ కవిత్వానికీ వర్తిస్తుందనే నేననుకుంటునాను.
నేను పై స్టేట్మెంట్ ను వెనుకనుంచి అన్వయించుకొంటాను. :-)
its ok
ravikran timmireddy Feb 14, 2010 48
ఇప్పటి సంగతిని ఎప్పటో సంగతి చెయ్యాలనేకదా !
కవి హరగోపాల్ గారికి, మిగిలిన పాఠకులకి నా క్షమాపణలు. ఈ అభిప్రాయం ఇక్కడ బహుశా అప్రస్తుతవేవో. కానీ ఉపేంద్ర గారు లేవనెత్తేరుగాబట్టి ఇక్కడ వేల్చేరు గారి వ్యాసం మీద నా అభిప్రాయం వ్రాయదల్చుకున్నాను.
వేల్చేరు గారు వ్రాసిన ఇప్పటి సంగతి, వారు ఇప్పటిని అప్పటికెప్పటికో తీసుకపోడానికి చేసిన ప్రయత్నం నాకు దాంట్లో కనిపించింది. ఎన్ని ముసుగులు కప్పినా, ఆ వ్యాసానికి మరెన్ని రంగులేసినా, అది కళ, కళకోసవే అని, ఆ కళ కోసవే అయినప్పుడు, ఆ కళని (సాహిత్యం) సృష్టించ గలిగిన వారు, ఆ కళని ఆనందించగలిగిన వారు, ఆ కళని బేరీజు వేసి, విమర్సించ గలిగిన వారు, కలాకారులే అయ్యుండాల్ని వారి అభిప్రాయం. అందుకనే సాహిత్యాన్ని సాహిత్యకారులే బేరీజు వెయ్యాలనే వాదని వారు తీసుకొచ్చారు. ఆ వాదాన్ని సమర్ధించు కోవడానికి, వారు ఇంజినీరింగు, ఫిజిక్సు మొదలైన శాస్త్రాలని ఉదాహరించారు. నిజవే ఒక ఇంజినీరు గొప్ప ఇంజినీరుని, ఆ ఇంజినీర్లతో ఏర్పడిన ప్రత్యేక సమాజవే గుర్తించగలదు. ఆ దారిలోనే ఫిజిస్టులు మొదలిన వారి గొప్పతానాన్ని కూడా, ఆయా రంగాలలో నిష్టాతులైన వారే గుర్తించగలరు. ఆ రకవైన గుర్తింపే వారికి వన్నెతెస్తుంది. మీరూ, నేనూ, మనలాటి సామాన్యుల అభిప్రాయాలు వారికేం గుర్తింపునియ్యవు.
అదే రీతిలో వేల్చూరి గారు సాహిత్యానికికూడా, ఒక జంధ్యం వేయదలచుకున్నారు. నిజం చెప్పాలంటే అప్పుడెప్పుడో వుండి, తెగిపోయిన ఆ పోగుని మరోసారి వారు పీఠంమీద కూర్చోపెట్టదలచుకున్నారు.
ఫిజిక్సు, ఇంజినీరింగు, వాటికి ఆలంబనగా వున్న గణిత శాస్త్రాం ఒక భాషే అయిన, అది ఒక ఎలీట్ సమాజాని అర్థవయ్యే భాషే. సామాన్యులకి ఆ భాష అర్థం కాదు. ఫలితాలని సామాన్యుడు అనుభవిస్తున్నా, ఆ ఫలితాల వెనుక వున్న భాషమాత్రం సామాన్యులకి అలవిగానిది. కానీ తెలుగు భాష ఆవిధంగా కాదు. ఇది ఏ ఎలీట్ సమాజానికో మాత్రవే పరిమితవంది కాదు. తెలుగుగానీ, మరో భాషగానీ ఆయా ప్రజల పరస్పర వ్యక్తీకరణకు ఆలంబనంగా రూపుదిద్దుకున్నదే. సాహిత్యం ఆ వ్యక్తీకరనకు ఒక రూపవే కానీ, అది ఆ వ్యక్తీకరణనుంచి వేరు కాదు. నిజవే, అనుమానవే లేదు, భాష కూడా ఎన్నోతరగతులగా, ఎన్నో రూపాలుగా అభివృద్దిచెందింది. కానీ ఏ తరగతి భాషైనా, ఏ భాషా రూపాంతరవైనా, దాన్ని సాహిత్యంగా వ్యక్తీకరించడవనేది సమాజంతో ఒక కాన్వర్జేషన్ కోసవే. అంటే ఇక్కడ ఫిజిసిస్టుల్లాగా, ఇంజినీర్ల లాగా, గణితవేత్తలలాగా ప్రాకృతిక వ్యక్తీకరణని అర్థం చేసుకోవటం కోసం, ఆ వ్యక్తీకరణని అర్థం చేసుకోగలిగే ఆ ప్రత్యేకవైన ఎలీట్ సమాజం కోసం మాత్రవే కాకుండా, సాహిత్యవనేది మనల్ని మనం మనల్ని వ్యక్థం చేసుకోవటం కోసం. ఆ దిశలో మన వ్యక్థీకరణ ఏ ప్రత్యేకవైన నలుగురుకోసవో కాకుండా, ఒక విశాలవైన సమాజం కోసం అయ్యుంటుంది. అంటే సాహిత్యం సాహిత్యకారులకోసం కాకుండా, సాహిత్యం సమాజం కోసం అయ్యుంటుంది. కాబట్టి సమాజంలో అందరికి ఆ సాహిత్యాన్ని, అనుభవించి ఆనందించేహక్కు, నచ్చకపోతే విమర్సించే హక్కు వుండితీరుతాయి.
గణితం మొదలైన శాస్త్రాలన్నీ, ప్రకృతి మాట్లడే భాషని అర్థం చేసుకోడానికి మాత్రవే వుపయోగం. ఇక్కడ మీకు కాన్వర్జేషన్ వుండదు. మీతో ప్రకృతికి పనిలేదు, మనం దానిని అర్థంచేసుకోవాలే కానీ, అది మననేం పట్టించుకోదు. కానీ సాహిత్య ప్రక్రియ ఒక సంభాషణ. సాహిత్యకారుడికి, సమాజానికి మధ్య ఒక సంభాషణ. ఇక్కడ ఆ సంభాషణ మంచి చెడులు నిర్ణయించగలిగింది విసృత సమాజవేగాని, మరో సాహిత్యకారుడు కాదు. సాహిత్యానికి పరిధిని నిర్ణయించి, దానికొక ఎలీట్ స్టేటస్ ఇచ్చి, తిరిగి సాహిత్యాన్ని ఏ కొందరి చేతుల్లోకో పరిమితం చెయ్యాలనే తలంపు నాకు వేల్చేరు గారి వ్యాసంలో నిండుగా కనపడుతుంది. పాఠకులా బహుపరాక్ .
చాకిరేవు ఉపేంద్ర Feb 17, 2010 49
రవి కిరణ్,
సమాజంలో వుండే ప్రతి మనిషికి కళ ని అనుభవించే, విమర్శించే హక్కు వుంటుంది అన్న విషయం ఇప్పుడు మళ్ళీ నిరూపించనవసరం లేదు. దాన్ని నిరూపించిన తరువాత ఇంక కళని అనుభవించటం ఎట్లాగ, విమర్శించటం ఎట్లాగ అన్నదాని మీద ఇంక దాని గురించి chepచెప్పుకోవలసిన విషయం చర్చించవలసిన విషయం ఏమీ లేదు అని అని దబాయించటం – ఇదీ మూడు తరాల రచయితలు కళాకారులు ఇప్పటికే చేసి వున్నారు.
‘విస్తృత సమాజమే’ అని అన్న మాటని జాగ్రతగా విస్లెషించకపోతే – రాజకీయంగా బలం వున్నవాడే, నోరున్న వాడే, తుపాకీ వున్న వాడే, ఆస్తిబలం కండ బలం అని అవుతుంది – ఇది ప్రత్యక్షంగా అనుభవించిన వాళ్ళు చాలా మందే వున్నారు కాబట్టి విషయం వచ్చింది. కాబట్టి విస్తృత సమాజం అంటే ఏమిటి, అందులో ఎవరు మాట్లాడుతారు, ఎట్లా మాట్లాడుతారు, ఎట్లా మాట్లాడుతారు. ఎప్పుడూ మాట్లాడుతారు ఇవన్నీటి పట్ల మీకున్న అవగాహన చెప్పక పోతే మీ మాటలని ఎట్లా అర్ధం చేసుకోవాలో తెలియదు.
వెల్చేరు నారాయణ రావు వ్యాసంలో పనికొచ్చే ముక్క వొక్కటీ కనపడక పోతే ఇప్పుడు వచ్చిన పెద్ద నష్టమేమీ లేదు. మీరూ విస్తృత సమాజంలో ఒక సభ్యులే కాబట్టి ఎలా వుండాలో మీరు చెప్పండి. సాహిత్య విలువ మీద చర్చ ఎట్లావుండాలో ?
పాపులారిటీ రేటింగులు సరిపోతాయా ? బాక్సాఫీసు కలెక్షన్లు సాహిత్యానికి ఒక కొలమానంగా మీరు ఒప్పుకుంటారా ? ప్రజలందరి aakaanskhalanఆకాంక్షలనూ నేను వ్యక్తీకరిస్తున్నాను అని ఒక కవో విమర్శకుదో అంటే , అది నిజమో కాదో మీరు ఎట్లా తేల్చు కుంటారు ? దానికి తూనిక రాళ్ళు ఏమిటి ? అటువంటి తూనిక రాళ్ళు అట్లా వుందాలా ఇట్లా వుందాలా అన్నది సమస్య కావచ్చును . అసలు తూనిక రాళ్ళు వుండకూడదు అని కూడా సిద్ధాంతీకరించవచ్చును. అది మీ సిద్ధాంతమయితే ఇక ఆ తరువాత సాహిత్యం అన్న ప్రత్యేక పదం వుపయోగం ఏమిటై వుండవచ్చును అన్నది కూడా చెప్పాలి.
ఎవరైనా ఏదైనా రాయచ్చును. అది ఎవరికి ఎట్లా అర్ధమైతే అట్లా అర్ధమవుతుంది. నేను రాసింది నీకు నచ్చకపోతే ఇంక దాని గురించి మాట్లాడుకోవలసిన పని లేదు. ఇట్లా సాహిత్యానికి వ్యక్తిగత టేస్ట్ తప్ప మరేమీ తూనిక అక్కరలేదు అని మీ అభిప్రాయమా ? అట్లా అయితే mlaeeమళ్ళీ సమాజమ్మూ, విస్తృత సమాజమూ అన్న మాటలెందుకు?
ఎలీటిస్ట్ విమర్శలకి మీరు చెప్తున్న జవాబు పాపులిజమో , అతి వుదారవాద ఇండివిడ్యుయలిజమో అయితే అది కోందనాలిక్కి మందేసి వున్న నాలికని వూదగోట్టుకోవటం అవుతుంది – ఈ రెండు ధోరణులూ తెలుగులో ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఆవిష్కరించవలసిన అవసరం లేదు. నిజానికి ఈ ధోరణులు సాహిత్యానికి వేసిన జంధ్యము వేయటమే కాదు. ఆ జంధ్యం కనిపించకుండా పైనించి చెర్మాస్ చొక్కా తొడిగాయి. వదిలించికోవలసిన అవసరం వచ్చింది కాబట్టి ఈ గొడవంతా జరుగుతున్నది .
చాకిరేవు ఉపేంద్ర Feb 18, 2010 50
పని వొత్తిడిలో వుండటం వలన జాగ్రత్తగా చదవటం కానీ, తప్పులు లేకుండా రాయటం kaanకానీ ఒక్కొక్క సారి కష్టమవుతోంది.
తిరునగరి గారు కూడా అలాగే తొందరలో చదివి వుంటారని అనుకుంటున్నాను. వెల్చేరు నారాయణ రావు అభిప్రాయమూ , నా అభిప్రాయమూ ఒకటే అయి వుంటే , నేనే ఆ మాట చెప్పిన తరువాతే ఆ లింకు ఇచ్చి వుందును. వెల్చేరు అభిప్రాయం చదవదగినది – అని మాత్రమే నేను చెప్పినది.
నాకు అర్ధమయినంతలో ఆ వ్యాసంలో ఆయన చెప్పినది, సాహిత్యకారులూ, విమర్శకులూ మాత్రమే సాహిత్యం విలువ నిర్ణయించాలని కాదు. సాహిత్యకారులూ, విమర్శకులూ కూడా సాహిత్య విలువలని నిర్ణయించే చర్చలో పాల్గొనాలని. చాలా కాలంగా వాళ్ళు ఆ పని చేయటం మానుకున్నారని. విస్తృత సమాజం నిర్ణయిస్తుంది అన్న వొక మాట అనేసి, సాహిత్యకారులూ విమర్శకులూ పరమ సోమరిపోతులుగానూ, అవకాశవాదులు గానూ మారిపోయినారని. ఈ బాధ్యతా రాహిత్యం వలన తెలుగు సాహిత్యం ముఠా రాజకీయాలకు మారు పేరుగా మారిపోయిందని. ఇది విమర్శ అయితే, దీనికి జవాబు, ఈ మాట సాహిత్యానికి జంధ్యము వేయటం అని చెప్పేయ్యటమో, వందేళ్ళ కిందటి రష్యన్ రచయితలను అడ్డుపెట్టుకుంటేనో . ఈనాటి సాహిత్యకారులూ, విమర్శకులూ ఎట్లా అవకాశవాదులు కారో, వాళ్ళు ఎంత కష్టపడి పనిచేస్తున్నారో నిరూపించాలి.
మీకు నా పేరు మీద ఏదో కుతూహలం వున్నట్లుంది. కలం పేర్లు పెట్టుకోవటం అంతా వింతైన విషయమా ? తెలంగాణలో నాకు చాలా వృత్తి పనుల పట్ల ప్రత్యేకమైన అభిమానం వుంది. చాకలి వృత్తి పట్ల కొంచెం ఎక్కువగా వుందనుకుంటాను. ప్రతాపరుద్రీయం నాటకములో చాకలి వాడు లేకపోతే యుగంధరుడు ఢిల్లీ కి వెళ్ళ గలిగి వుండే వాడు కాదు. ఆసిరిగాడు లేకపోతే కన్యాశుల్కం నాటకం లేదు. నాకు జీవితంలో కొన్ని ముఖ్యమైన పాఠాలు నేర్పిన వొక చాకలి పేరు నేను కలం పేరుగా పెట్టుకున్నాను.
rameshnishani Feb 27, 2010 51
చకిరెవు ఉపెంద్ర గరు నీ కలమ్ లొ సిర విషయమ్ పక్కన పెదితె అసలు నీకు ఒక కవితె వెనకల ఉన్న బవొద్వెగన్ని అర్తమ్ చెసుకొలెని పరిస్తిథి లొ నువ్వుందదమ్ చుసి నకు బాద గ ఉంది ఆ ఆలొచనె నీకు రలెదు ఇలంతి అర కొర గ్జ్ననమ్ తొ నువ్వు రాసె చర్చ నీకు అర్హమయితె చలు అనిపిస్తుంది అలాంతి ని నీకు ప్రసదించుమని నీవు దన్నమ్ పెత్తుకునె దెవునికి నా మతగ చెప్పుకొ నీ దాద విన్నవించుకొ
rameshnishani Feb 27, 2010 52
నీకు ఆ షక్తని ప్రషాదించమని నీ బాద ని మీ దెవునికి విన్నవించుకొ
పవనకుమార్ Mar 5, 2010 53
rameshnishani గారూ, ఈ పని బాగా అలవాటు లేని మన్లాంటి వాళ్లం కామెంటును ముందుగా వర్ద్ లో రాసి, చదువుకుని, ఆ తరువాత కాపీ చేసి, కావలసిన చోటికి తెచ్చి అతికించడం మేలు అనుకుంటా.
tirumalesa Mar 6, 2010 54
ఎవరైనా ఈక్రింది వాక్యాలకు అర్థం చెప్పగలరా.. హరగోపాల్ గారూ, ఉపేంద్రగారూ కాస్త మిగిలిన పాఠకులకు హెల్ప్ చేయండి ప్లీజ్.. హెచ్చార్కే గారూ మీరుకూడా..
there are many job vacancies in australia . including washing of empty beer bottles, cleaning the floors of pubs and looking at the motherless sky with dead eyes. the sky, always blue blue blue for ever. are you hold tools with me?.
హా.. సత్యదర్శనా ఎంతపనిచేశావయ్యా….
ramnarsimha Jun 12, 2010 55
సత్యద్రర్షన గారు,
మీ అభిప్రాయాన్ని జర తెలుగులో్ చెప్పుండ్రి…..
ramnarsimha Jun 12, 2010 56
సత్యదర్షన గారి అభిప్రాయాన్ని,
జర ఎవరైనా…
తెలుగులోకి అనువాదం చెయ్యండి…. ప్లీజ్..